Russian Missing : పుతిన్ వ్యతిరేకి ఒడిశాలో అదృశ్యం

ABN , First Publish Date - 2022-12-31T19:47:17+05:30 IST

రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) విమర్శకుడు ఒకరు ఆ దేశం నుంచి ఒడిశాకు వచ్చి,

Russian Missing : పుతిన్ వ్యతిరేకి ఒడిశాలో అదృశ్యం
Russian

భువనేశ్వర్ : రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) విమర్శకుడు ఒకరు ఆ దేశం నుంచి ఒడిశాకు వచ్చి, ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోయారు. ఇటీవల పుతిన్ విమర్శకులు ఇద్దరు ఈ రాష్ట్రంలోని రాయగడలో అంతుబట్టని రీతిలో మరణించి కనిపించారు. మృతుల్లో ఒకరు రష్యన్ ఎంపీ కావడం గమనార్హం.

ఆచూకీ కనిపించకుండాపోయిన రష్యన్ ఒడిశాలోని పురిలో ఉండేవారని తెలిసింది. ఓ నెల క్రితం ఆయన ఒడిశా రాజధాని నగరం భువనేశ్వర్‌ (Bhubaneswar)లో ప్లకార్డు పట్టుకుని, తనకు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ కనిపించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని, పుతిన్‌ను వ్యతిరేకిస్తూ ఈ ప్లకార్డులో నినాదాలను రాశారు.

‘‘నేను రష్యన్‌ శరణార్థిని. నేను యుద్ధానికి వ్యతిరేకం. నేను పుతిన్‌కు వ్యతిరేకం. నేను నిరాశ్రయుడిని. దయచేసి నాకు సాయం చేయండి’’ అని ఈ ప్లకార్డులో ఉంది. ఈ ప్లకార్డుతోపాటు ఆ వ్యక్తిని ఓ ప్రయాణికుడు ఫొటో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది. ఓ నెల క్రితం భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీ అధికారులు ఆ రష్యన్‌తో మాట్లాడారు. జీఆర్‌పీ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ జయదేవ్ బిశ్వజిత్ మాట్లాడుతూ, ఓ నెల క్రితం ఈ రష్యన్ గురించి తమకు కొందరు ప్రయాణికులు చెప్పారన్నారు. ఓ ప్లకార్డు పట్టుకుని ప్లాట్‌ఫాం వద్ద సంచరిస్తున్న ఆయన వద్దకు తాను వెళ్లి, వివరాలు అడిగానని చెప్పారు. ఆయన వద్ద ఉన్న పాస్‌పోర్టు, వీసాలను తనిఖీ చేశానని, అవి సరిగానే ఉండటంతో తాను వదిలిపెట్టానని చెప్పారు. ఆయన ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోవడంతో తాను మరిన్ని వివరాలను తెలుసుకోలేకపోయానన్నారు.

పురి ఎస్‌పీ కన్వర్ విశాల్ సింగ్ మాట్లాడుతూ, జీఆర్‌పీ అధికారులు తమను సంప్రదించారని, తక్షణమే తాము సహాయపడ్డామని చెప్పారు. ఆ రష్యన్ ఆచూకీ కోసం తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఇదిలావుండగా, రాయగడలోని ఓ హోటల్‌లో దిగిన రష్యన్ ఎంపీ, వ్యాపారవేత్త పావెల్ ఆంటోవ్ (Pavel Antov), ఆయనతోపాటు వచ్చిన మరొక వ్యక్తి వ్లదిమిర్ బిడెనోవ్ (Vladimir Bidenov) మరణించారు. బిడెనోవ్ డిసెంబరు 22న ఈ హోటల్‌లోని తన గదిలో మరణించి కనిపించగా, ఆంటోవ్ డిసెంబరు 24న అదే హోటల్‌లోని మూడో అంతస్థు నుంచి పడిపోవడంతో మరణించారు. వీరి మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ కేసుపై సీఐడీ దర్యాప్తు జరుపుతోంది.

Updated Date - 2022-12-31T19:47:21+05:30 IST