China lifts restrictions: చైనాలో రోజుకు 30 వేల కేసులు.. చైనా సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-12-05T18:20:42+05:30 IST

చైనాలోని ఉరుమ్కీ నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది సజీవ దహనమైన ఘటన

China lifts restrictions: చైనాలో రోజుకు 30 వేల కేసులు.. చైనా సంచలన నిర్ణయం

బీజింగ్: చైనాలోని ఉరుమ్కీ నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది సజీవ దహనమైన ఘటన దేశంలో ప్రకంపనలు రేపింది. కరోనా లాక్‌డౌన్ (Corona Lockdown), ఆంక్షల కారణంగా భవనం లోపల ఉన్నవారు తప్పించుకోలేక అగ్నికి ఆహుతయ్యారంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. లాక్‌డౌన్ ఎత్తివేయాలని, ఆంక్షలు తొలగించాలంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఉరుమ్కీలో ప్రారంభమైన ఈ నిరసనలు క్రమంగా దేశమంతా విస్తరించాయి.

ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం చాలా చోట్ల ఆంక్షలు సడలించింది. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు ఎత్తివేసింది. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ‘జీరో కొవిడ్’ (Zero Covid) పాలసీని అమలు చేస్తున్న చైనాలో గత కొన్ని వారాలుగా ప్రతి రోజు ఏకంగా 30 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో చైనా తాజాగా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

రాజధాని బీజింగ్, షాంఘై, ఝెంగ్ఝౌ, షెంజెన్ తదితర నగరాల్లోని ప్రజలు కరోనా పరీక్ష చేయించుకోకున్నా బస్సులు, సబ్ వేలలో ప్రయాణించవచ్చని తెలిపింది. బీజింగ్‌లో టెస్టింగ్ కేంద్రాల(Corona Testing Centers)ను ఎత్తివేసినప్పటికీ ఇంకా కొన్ని వేదికల వద్ద కరోనా టెస్టులు చేయించుకుంటేనే అనుమతిస్తున్నారని రాజధాని వాసులు ఆరోపిస్తున్నారు.

చైనాలో ప్రతి పదిమందిలో 9 మంది టీకా (Covid Vaccine) తీసుకున్నారు. 80 ఏళ్లు దాటిన వారిలో 66 శాతం మంది సింగిల్ డోసు తీసుకున్నారు. 40 శాతం మంది బూస్టర్ డోస్ తీసుకున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 60 ఏళ్లు పైబడి వారిలో 86 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. నెగటివ్ రిజల్ట్ లేదన్న కారణంగా ఆసుపత్రులకు వచ్చే వారిని అడ్డుకోవద్దని బీజింగ్‌లోని ఆసుపత్రులను అధికారులు ఆదేశించారు. అయితే, చెంగ్డు, గ్వాంగ్ఝౌ వంటి నగరాల్లో మాత్రం ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి

Updated Date - 2022-12-05T18:20:45+05:30 IST