Gujarat Polls: సూరత్‌లో 7 నుంచి 8 సీట్లు, మొత్తంగా 92.. కేజ్రీవాల్ జోస్యం

ABN , First Publish Date - 2022-11-28T17:23:14+05:30 IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో డైమండ్ సిటీ సూరత్‌ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ 7 నుంచి 8 సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్..

Gujarat Polls: సూరత్‌లో 7 నుంచి 8 సీట్లు, మొత్తంగా 92.. కేజ్రీవాల్ జోస్యం

సూరత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో డైమండ్ సిటీ సూరత్‌ (Surat) నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 7 నుంచి 8 సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జోస్యం చెప్పారు. తన జోస్యాన్ని (గెలుపు సంఖ్యను) ఒక పేపరుపై రాసి మరీ ఆయన చెప్పారు. దీనికి ముందు ఆదివారంనాడు కూడా ఇదే తరహా లిఖిత పూర్వక జోస్యం చెబుతూ, గుజరాత్‌ ఎన్నికల్లో మొత్తంగా తమ పార్టీ 92 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

''సూరత్‌లో ఆప్ 7 నుంచి 8 సీట్లు గెలుచుకుంటుంది. మా పార్టీ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా భారీ ఆధిక్యంతో గెలుస్తారు. సీఎం అభ్యర్థి ఇసుదాన్ గఢవీ, పాటిదార్ ఉద్యమ మాజీ నేత అల్పేష్ కథిరియా కూడా గెలుస్తారు'' అని కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో వ్యాపారాలు ఎలాంటి భయాలు, బెదరింపులకు తావులేని విధంగా వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని తమ పార్టీ కల్పిస్తుందని చెప్పారు. గుజరాత్ యువకులు, మహిళలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు పెంచేందుకు అనుమతించమని, ఉచిత, నాణ్యతాయుతమైన వైద్య చికిత్సను ప్రజలకు అందిస్తామని హామీ చెప్పారు. నిరుద్యోగితను తొలగించడం ఒక్క ఆప్ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. యువతకు ఉద్యోగాలు వచ్చేంతవరకూ రూ.3,000 అలవెన్స్ ఇస్తామని భరోసా ఇచ్చారు.

మా మధ్య పోటీ లేదు...మేమే ముందున్నాం

ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి మధ్య పోటీ లేదని, తాము (ఆప్) ముందంజలో ఉన్నామని కేజ్రీవాల్ మరోసారి స్పష్టం చేశారు. కాగా, సూరత్‌‌లో 12 అసెంబ్లీ స్థానాలుండగా, డిసెంబర్ 1న ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి.

Updated Date - 2022-11-28T17:23:16+05:30 IST