Nursing విద్యార్థులకు తీపి కబురు! భారీగా పోస్టుల భర్తీ!
ABN , First Publish Date - 2022-12-31T11:47:58+05:30 IST
నర్సింగ్ విద్యార్థుల (Nursing students)కు తీపి కబురు! వైద్య ఆరోగ్యశాఖ (Medical Health Department)తో పాటు గురుకులాల్లో 5,204 సాఫ్ట్ నర్సుల పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ
5204 స్టాఫ్ నర్స్ పోస్టులు!
నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ బోర్డు
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నర్సింగ్ విద్యార్థుల (Nursing students)కు తీపి కబురు! వైద్య ఆరోగ్యశాఖ (Medical Health Department)తో పాటు గురుకులాల్లో 5,204 సాఫ్ట్ నర్సుల పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి గోపికాంత్రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన నర్సింగ్ అభ్యర్థులు జనవరి 25 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తులకు ఫిబ్రవరి 15 తుదిగడువు. జీఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులని బోర్డు పేర్కొంది. ఈ పోస్టులకు వయోపరిమితి 18-44. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్య్యూఎస్కు వయోపరిమితిలో ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఇచ్చారు.
వంద పాయింట్ల ప్రాతిపదికన ఎంపిక
మొత్తం వంద పాయింట్ల ప్రాతిపదికన నర్సు పోస్టుల భర్తీ ఉంటుంది. ఇందులో 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. అన్నీ మల్టిపుల్చాయిస్ పద్ధతిలోనే ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఇంగ్లి్షలో నిర్వహిస్తామని బోర్డు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్లో రాత పరీక్ష కేంద్రాలుంటాయి. అభ్యర్థులు ఏవైనా రెండు కేంద్రాలను ఆప్షన్స్గా ఇవ్వవచ్చు. రాత పరీక్ష ఏయే సబ్జెక్టుల నుంచి ఇవ్వనున్నారన్నది నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులను 80 శాతం పాయింట్లుగా తీసుకుంటారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేసేవారికి సర్కారు 20 పాయింట్లను వెయిటెజ్గా ఇచ్చింది. కనీసం ఆరు మాసాలు పనిజేసిన వారికే ఇది వర్తిస్తుంది. గిరిజన ప్రాంతాల్లో పనిజేసిన వారికి ఆరు నెలలకు 2.5 పాయింట్లు, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే రెండు పాయింట్లు ఇస్తారు. గరిష్ఠంగా 20 పాయింట్లు కేటాయిస్తారు. స్టాఫ్నర్స్గా ఉండీ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఏఎన్ఎమ్గా పనిచేసినవారికి ఎటువంటి వెయిటెజ్ ఉండదని స్పష్టం చేసింది. సర్కారీ దవాఖానాల్లో పనిజేసే నర్సులు సంబంధిత ఆస్పత్రుల నుంచే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సివుంటుందని వెల్లడించింది. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని, నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని, తర్వాత ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదని బోర్డు పేర్కొంది.
అత్యధిక పోస్టులు సంచాలకుల పరిధిలోనే
ప్రభుత్వం (Telangana) కొత్తగా 8 మెడికల్ కాలేజీల (Medical colleges)ను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది మరో 9 కాలేజీలను ఏర్పాటుకు సిద్ధమైంది. వాటిలో పెద్దయెత్తున వైద్యసిబ్బంది అవసరం అవుతారు. ఈనేపథ్యంలో తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor)తో పాటు ఇప్పుడు స్టాఫ్నర్స్ పోస్టుల నోటిఫికేషన్ జారీ చేసింది. మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన మొత్తం పోస్టుల్లో ఒక్క వైద్యవిద్య సంచాలకుల పరిధిలోనే ఏకంగా 3823 స్టాఫ్నర్స్ పోస్టులున్నాయి. ఆ తర్వాత తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల పరిఽధిలో 757 పోస్టులున్నాయి. ఆయుష్ పరిధిలో ఉన్న స్టాఫ్నర్స్ పోస్టుల ఖాళీల గురించి ఈ నోటిఫికేషన్లో పేర్కొనలేదు. అయా గురుకులాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్నర్స్ పోస్టుల భర్తీని కూడా మెడికల్ బోర్డు పరిధిలోకి తీసుకువచ్చారు. వాస్తవానికి గురుకులాల్లోని నర్స్పోస్టుల భర్తీ టీఎస్పీఎస్సీ(Tspsc) ద్వారా చేయాలనుకున్నారు. కానీ చివరికి వాటి భర్తీని మెడికల్ బోర్డు(Medical Board)కు అప్పగించారు.
వేగంగా ఉద్యోగాల భర్తీ: మంత్రి హరీశ్రావు
ఉద్యోగాలభర్తీ ప్రక్రియ పండుగ కొసాగుతోందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు (Health Minister Harish Rao) అన్నారు. ఈమేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ (Cm kcr) హామీ ఇచ్చిన మేరకు 5,204 నర్స్ పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదలైందన్నారు. బోర్డు ద్వారా ఇప్పటివరకు 7,320 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని, ఇందులో 969 సీఎఎస్ పోస్టుల భర్తీ పూర్తయిందని ట్విటర్లో పేర్కొన్నారు. అలాగే ఏయే శాఖలో ఎన్ని పోస్టుల భర్తీ చేస్తున్న వివరాలను ట్విటర్లో ఖాతాలో పోస్టు చేశారు.