Nadendla Manohar: అదే రామచంద్రయాదవ్ చేసిన నేరమా?..

ABN , First Publish Date - 2022-12-05T12:56:37+05:30 IST

అమరావతి: జనసేన (Janasena) నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Nadendla Manohar: అదే రామచంద్రయాదవ్ చేసిన నేరమా?..

అమరావతి: జనసేన (Janasena) నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాన ప్రాణాలను తోడేస్తామన్న రీతిలో రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) ఇంటిపై జరిగిన భీభత్సకాండ ఉందన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కారు ఆలోచన విధానాన్ని.. దుర్నీతినీ ప్రపంచానికి మరోమారు వెల్లడి చేస్తోందన్నారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి (Peddireddy Ramachandrareddy) నియోజకవర్గంలో రైతు సభను నిర్వహించాలనుకోవడమే రామచంద్ర యాదవ్ చేసిన నేరమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోవడం ఈ ప్రాంతంలో నిషిద్దమా? అని నిలదీశారు. రైతు సభకు అనుమతి లేదన్న అధికారులు.. రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ కిరాయి మూకలు దాడులు చేస్తుంటే సకాలంలో ఎందుకు ఆపలేకపోయారని అన్నారు. ఇది ముమ్మాటికీ అధికార పక్షం చేస్తున్న వికృత రాజకీయంలో భాగమేనన్నారు. గత ఎన్నికలో జనసేన పార్టీ నుంచి పుంగనూరులో పోటీ చేసిన రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా గర్హిస్తున్నామన్నారు. ప్రశ్నించేవారు, వైసీపీకి వ్యతిరేకంగా, బలంగా పోటీ చేసేవారు లేకుండా చేసుకునే కుట్రలో భాగంగా అక్కడి పరిస్థితులను బట్టి అవగతమవుతోందన్నారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రంపై జరిగిన దాడిగా జనసేన పార్టీ భావిస్తోందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజాస్వామికవాదులంతా ఈ దాడిని ఖండించాలని నాదెండ్ల మనోహర్ పిలుపిచ్చారు.

Updated Date - 2022-12-05T12:56:43+05:30 IST