Share News

Elections 2024: కేసీఆర్, వైఎస్ జగన్ ఇద్దరూ మార్చేశారు.. ఆ నమ్మకమే గెలిపిస్తుందా..!?

ABN , Publish Date - May 05 , 2024 | 12:07 PM

వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్లు కొందరైతే.. విశ్వసించని వారు మరికొందరు.. అయితే ఎన్నికల వేళ మాత్రం రాజకీయ నాయకులు ఎక్కువుగా నమ్మేది వాస్తు శాస్త్రమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టగా.. ఏపీ సీఎం జగన్ సైతం తాడేపల్లిలోని తన నివాసంలో వాస్తు మార్పులు చేయించినట్లు తెలుస్తోంది. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండకపోవడానికి కారణం వాస్తు సమస్యేనంటూ కొందరు పండితులు చెప్పడంతో ఈ ఇద్దరు వాస్తులో మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

Elections 2024: కేసీఆర్, వైఎస్ జగన్ ఇద్దరూ మార్చేశారు.. ఆ నమ్మకమే గెలిపిస్తుందా..!?
CM YS Jagan

వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్లు కొందరైతే.. విశ్వసించని వారు మరికొందరు.. అయితే ఎన్నికల వేళ మాత్రం రాజకీయ నాయకులు ఎక్కువుగా నమ్మేది వాస్తు శాస్త్రమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టగా.. ఏపీ సీఎం జగన్ సైతం తాడేపల్లిలోని తన నివాసంలో వాస్తు మార్పులు చేయించినట్లు తెలుస్తోంది. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండకపోవడానికి కారణం వాస్తు సమస్యేనంటూ కొందరు పండితులు చెప్పడంతో ఈ ఇద్దరు వాస్తులో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఎప్పుడూ జాతక శాస్త్రం, వాస్త్రు శాస్త్రాలను నమ్మని వ్యక్తి తన ఇంటికి వాస్తు ప్రకారం మార్పులు చేయించడం ఒకింత ఆశ్చర్చాన్ని కలిగిస్తోంది. ఓటమి భయంతోనే ఈ ఇద్దరు నాయకులు వాస్తు మార్పులు చేయించుకున్నారనే చర్చ జరుగుతోంది.


ఆ విషయంలో కేసీఆర్ టాప్..

వాస్తు, జాతకాలను ఎక్కువ నమ్మే వారిలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఏ పని చేసినా ముహుర్త బలం చూస్తుంటారు. అంతేకాదు ఆయన ఉండే ఇళ్లు, కార్యాలయం, వాహనంతో సహా అన్నింటికి వాస్తు, సంఖ్యా బలం బలంగా ఉండేలా కేసీఆర్ చూస్తారనేది అందరికీ తెలిసిన విషయం. అయితే 2023 సెప్టెంబర్ తర్వాత నుంచి బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో అనుకూల పరిస్థితులు లేవు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోవడం, మరోవైపు కుమార్తె కవిత జైలుకు వెళ్లడం, తాను నమ్మిన వ్యక్తులే పార్టీ విడిచిపెట్టి వెళ్లిపోవడం వంటి పరిస్థితులు గులాబీ బాస్‌ను కొంత ఆందోళన కలిగించాయి. లోక్‌సభ ఎన్నికల వేళ కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూల పరిస్థితులు లేవని పలు సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడికావడంతో.. ఎందుకు ఇలా జరుగుతుందనేదానిపై గులాబీ బాస్ ఆలోచించడం మొదలుపెట్టారు. చివరికి బీఆర్‌ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్‌ వాస్తు సరిగా లేదని, వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ భవన్‌లో వాస్తు రీత్యా మార్పులు చేస్తున్నారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు పలు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ తెలంగాణ భవన్‌ తూర్పు అభిముఖంగా ఉండగా వాయవ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు జరుగుతున్నాయి. వాస్తు నిపుణుల సలహా మేరకు ఇకపై ఈశాన్యం వైపు ఉన్న గేటును రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును తెరిచి వాహనాల రాకపోకలకు వీలుగా ర్యాంపు నిర్మాణం చేపట్టారు. మరోవైపు వీధి పోటును దృష్టిలో పెట్టుకుని దక్షిణభాగంలో ఉన్న గేటు వద్ద యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

Sujana Choudary: వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు


వైసీపీ అధినేత జగన్..

మరోవైపు ఏపీ సీఎం జగన్ సైతం తాడేపల్లిలోని తన నివాసంలో కొన్ని వాస్తు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా జగన్ వాస్తును అసలు పట్టించుకోరనేది ఆయన గురించి తెలిసిన ఎవరిని అడిగినా చెప్తారు. కానీ సడన్‌గా తాడేపల్లిలోని ఆయన నివాసంలో కొన్ని మార్పులు చేయడంతో జగన్‌ను ఓటమి భయం వెంటాడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తు సరిగా లేకపోయినా ఫలితాలు అనుకూలంగా రాకపోవచ్చనే ఉద్దేశంతోనే తాడేపల్లిలోని జగన్ నివాసం మార్పులు చేస్తున్నారట. ఇటీవల కాలంలో జగన్ వ్యూహాలన్నీ ఫెయిల్ అవుతూ వస్తుండటంతో పండితుల సూచనమేరకు వాస్తు మార్పునకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంత చేసినా తమ పార్టీకి అనుకూల వాతావరణం లేకపోవడంతో అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వాస్తు, జ్యోతిష్య పండితులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఓ వాస్తు పండితుడిని తాడేపల్లి ప్యాలెస్‌కు తీసుకువచ్చి చూపించగా.. ఆ పండితుడు కొన్ని మార్పులు చేయాలని సూచించినట్లు సమాచారం. సీఎం జగన్ నివసిస్తున్న ఇంట్లో వాస్తుపరంగా కొన్ని మార్పులు చేస్తే పరిస్థితిలో కొంచెం మార్పు ఉండవచ్చని చెప్పారట. దీంతో సీఎం క్యాంప్‌ కార్యాలయం, ఇంటి చుట్టూ ఎత్తుగా ప్రహరీలా నిర్మించిన ఇనుప కట్టడాన్ని ఒక మూల తొలగించాలని పండితులు సూచించడంతో సీఎం క్యాంపు కార్యాలయంలో మరమ్మతు పనులు మే1వ తేదీ నుంచి ప్రారంభించారు.


ఓవైపు కేసీఆర్.. మరోవైపు జగన్

ఓవైపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తే, జగన్ సైతం తన నివాసంలో వాస్తు మార్పులు చేయడం ఆసక్తి రేపుతోంది. జగన్ వాస్తు శాస్త్రాన్ని నమ్మడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే జగన్ వాస్తు మార్పులు చేశారని మరికొందరు విమర్శిస్తున్నారు. వాస్తు మార్పులు జగన్, కేసీఆర్‌కు కలిసొస్తాయా లేదా అనేది జూన్4న తేలనుంది.


CM Ramesh: వైసీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 05 , 2024 | 12:18 PM