Share News

Telangana: విపక్షాలు జేబులో.. లేదా జైల్లో ఉండాలి: కేటీఆర్

ABN , Publish Date - Apr 19 , 2024 | 09:04 AM

‘‘దేశంలో విపక్షాలు ఉంటే నా జేబులో ఉండాలి లేదంటే జైలులో ఉండాలి అన్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తీరు ఉంది. గతంలో పండుగలకు నేతలు ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకొనేవారు. మోదీ వచ్చాక విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పరిస్థితి లేకుండా చేశారు’’ అని బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) వ్యాఖ్యానించారు.

Telangana: విపక్షాలు జేబులో.. లేదా జైల్లో ఉండాలి: కేటీఆర్
KTR

  • ప్రధాని మోదీ తీరు ఇదే..

  • ఆయనదంతా విద్వేషం..

  • మేం గెలవనున్న మొదటి స్థానం సికింద్రాబాద్‌

  • పద్మారావుకు భయపడి కిషన్‌రెడ్డి సీటు మారే యత్నం: కేటీఆర్‌

యూసుఫ్‌గూడ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలో విపక్షాలు ఉంటే నా జేబులో ఉండాలి లేదంటే జైలులో ఉండాలి అన్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తీరు ఉంది. గతంలో పండుగలకు నేతలు ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకొనేవారు. మోదీ వచ్చాక విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పరిస్థితి లేకుండా చేశారు’’ అని బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) వ్యాఖ్యానించారు. తెలంగాణకు(Telangana) రూపాయి ఇవ్వని బీజేపీని(BJP) అణగదొక్కాలని పిలుపునిచ్చారు. వంద రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. అది చేతకాక స్కామ్‌లంటూ మాయమాటలు చెబుతున్నారని, ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో రోజుకో లీక్‌ ఇచ్చి కాలం గడుపుతున్నారని ఆరోపించారు. ఆయన రాహుల్‌గాంధీ కోసం పనిచేస్తున్నారా? మోదీ కోసమా? అని ప్రశ్నించారు.


‘‘బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్‌కు లేదు. అది బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం. కేసీఆర్‌ కాళేశ్వరం లిఫ్ట్‌లను ప్రారంభిస్తే కిషన్‌రెడ్డి రైల్వే స్టేషన్‌ లిఫ్ట్‌ ప్రారంభించారు. తెలంగాణకు ఏం చేశారని అడిగితే.. చెప్పడానికి ఏమీ లేక జైశ్రీరాం అంటున్నారు’’ అని కేటీఆర్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలవబోయే తొలి సీటు సికింద్రాబాద్‌ అని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ బూత్‌స్థాయి సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. కేంద్ర మంత్రిగా ఐదేళ్లలో రాష్ట్రానికి రూపాయి కూడా తీసుకురాని కిషన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు భయపడి, వేరేచోట నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలిసిందన్నారు.


125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేయని రేవంత్‌, అంబేడ్కర్‌ పేరుతో కేసీఆర్‌ నిర్మించిన సచివాలయంలో సిగ్గులేకుండా కూర్చున్నారని ధ్వజమెత్తారు. లంకె బిందెలు ఉన్నాయనుకున్నానని అన్నారని.. వాటి కోసం తిరిగేది దొంగలు కదా? అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వాళ్లు.. కల్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్నారని, ప్రచారానికి వస్తే తులం బంగారం ఏదీ అని అడగాలని సూచించారు. దానం నాగేందర్‌ సీటు పోవడం ఖాయమని, ఉప ఎన్నిక ఖాయమని పేర్కొన్నారు.

ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 09:04 AM