సజ్జ రొట్టెలు మెత్తగా, మృదువుగా  రావాలంటే.. ఇలా చేయాలి..

స్టవ్‌ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి అరచెంచా ఉప్పు, ఒక చెంచా నెయ్యి వేసి అయిదు నిమిషాలు మరిగించి దించాలి. 

ఇందులో ఒక గ్లాసు సజ్జ పిండి వేసి మెల్లగా కలుపుతూ ముద్దలా చేయాలి. 

దీనిపై తడిగుడ్డ కప్పి పది నిమిషాలు నాననిస్తే పిండి ఉబ్బుతుంది. రొట్టెలు కూడా మెత్తగా వస్తాయి.

సజ్జ పిండిని ఎక్కువసేపు కలపకూడదు. నీళ్లు కలిసి ముద్దలా అయితే చాలు.

సజ్జ రొట్టెలను పలుచగా ఒత్తకూడదు. కొంచెం మందంగానే ఉండాలి. 

పొడి పిండి చల్లుకుంటూ పెద్దగా నొక్కకుండా తేలికగా ఒత్తాలి.

స్టవ్‌ మీద ఇనప పెనం పెట్టి అది వేడెక్కాక సజ్జ రొట్టెను జాగ్రత్తగా వేయాలి.

 ఒకవైపు కాలిన తరవాతే రెండోవైపుతిప్పాలి.

సజ్జ రొట్టెలు త్వరగా గట్టిపడతాయి. కాబట్టి ఎక్కువసేపు కాల్చకూడదు. 

రొట్టెమీద గోధుమ రంగుచుక్కలు కనిపించగానే రెండోవైపునకు తిప్పాలి.

రెండు వైపులా దోరగా కాలిన తరవాత పళ్లెంలోకి తీసి కొద్దిగా నెయ్యి రాయాలి.

ఇలాచేస్తే చాలా సమయం వరకు రొట్టెలు మెత్తగా ఉంటాయి.