సర్పంచ్‌, ఎంపీటీసీలే జెండా ఎగరేయాలి: రాజేంద్రప్రసాద్

ABN , First Publish Date - 2021-08-14T20:02:51+05:30 IST

అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోనే జెండా ఎగురవేయించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.

సర్పంచ్‌, ఎంపీటీసీలే జెండా ఎగరేయాలి: రాజేంద్రప్రసాద్

అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోనే జెండా ఎగురవేయించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌లతో జెండా వందనం చేయించాలని చూస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి విరుద్ధమని చెప్పారు. సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసే హక్కు, అధికారాలను రాజ్యాంగం.. సర్పంచ్, ఎంపీటీసీలకు కల్పించిందని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ హక్కులను కాలరాస్తూ విద్యా కమిటీ చైర్మన్లతో జెండా ఎగుర వేయించాలని ఆదేశాలివ్వడం దారుణమన్నారు. సర్పంచ్‌లకు వ్యతిరేకంగా నిధులు, విధులు, అధికారాలు, గ్రామ సచివాలయాలు తదితర అంశాల్లో వరుసగా చట్ట వ్యతిరేక జీవోలను జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనాలోచిత జీవోలు అమలైతే.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతారన్నారు. పంచాయతీ‌రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీవోలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-14T20:02:51+05:30 IST