బెట్టింగులకు యువకుడు బలి
ABN , First Publish Date - 2021-02-28T06:46:34+05:30 IST
బెట్టింగులతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.
ఉరివేసుకుని ఆత్మహత్య
కుప్పం/కుప్పం రూరల్, ఫిబ్రవరి 27: బెట్టింగులతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు గ్రామానికి చెందిన కుప్పం వ్యవసాయ మార్కెట్టు కమిటీ మాజీ డైరెక్టర్ బసవరాజు కుమారుడు బి.రాజ్ కిరణ్ కుప్పంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఉదయం కళాశాలకు వెళ్లొస్తానంటూ యథావిధిగా ఇంటినుంచి బయలుదేరాడు. అనంతరం కళాశాల సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. అతడు సామాజిక మాధ్యమాలలో చేసిన పోస్టింగులను బట్టి, బెట్టింగుల అలవాటుతోనే ఇలా చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ప్లీజ్ మరోసారి చెబుతున్నా. బెట్టింగులకు వెళ్లకండి.. నాలాగా మీ జీవితాలను నాశనం చేసుకోకండి.’ అని ఆంగ్లంలో ఉన్న పోస్టింగ్ అతని ఇన్స్టాగ్రాంలో కనిపించింది. అయితే అతనికి బెట్టింగులు అలవాటు లేవని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎస్ఐ నరేంద్రను వివరణ కోరగా సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ కావడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.