యువరైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-11T05:51:57+05:30 IST
కండ్లగూడూరు గ్రామానికి చెందిన యువరైతు వెంకటరాముడు (30) అప్పులబాధ తాళలేక బుధవారం విష ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటరాముడుకు 22 ఎకరాల పొలం ఉంది.
పెద్దవడుగూరు, ఆగస్టు 10: మండల పరిధిలోని కండ్లగూడూరు గ్రామానికి చెందిన యువరైతు వెంకటరాముడు (30) అప్పులబాధ తాళలేక బుధవారం విష ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటరాముడుకు 22 ఎకరాల పొలం ఉంది. ఇందులో పత్తి, వేరుశనగ పంటలు, చీనీ తోట సాగుచేశాడు. ఈ క్రమంలో బోరుబావుల తవ్వకానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేశాడు. అయినా పంటలు సరిగా పండక తీవ్రంగా నష్టపోయాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు రూ.12 లక్షలు దాటాయి. వాటిని తీర్చేమార్గం లేక తీవ్ర మనోవేదన చెందేవాడు. ఈ క్రమంలో బుధవారం పొలానికి వెళ్లి విష ద్రావకం తాగాడు. అపస్మారకస్థితిలో ఉండగా గమనించిన పొరుగు రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే చికిత్స నిమిత్తం వెంకటరాముడును పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటరాముడు మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. రైతు వెంకటరాముడుకు భార్య తేజస్విని, కూతురు ఉన్నారు. రైతు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు.