ప్రభుత్వ ఉద్యోగం దొరికిందని యువకుని ఆత్మహత్య... సూసైడ్ నోట్‌లో...

ABN , First Publish Date - 2020-11-01T12:15:59+05:30 IST

తమిళనాడులోని కన్యాకుమారిలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి...

ప్రభుత్వ ఉద్యోగం దొరికిందని యువకుని ఆత్మహత్య... సూసైడ్ నోట్‌లో...

కన్యాకుమారి: తమిళనాడులోని కన్యాకుమారిలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ప్రభుత్వ ఉద్యోగం దొరికిందని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో ఆ యువకుడు తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే తన జీవితాన్ని త్యాగం చేసి, భగవంతుని చరణాల వద్దకు చేరుకుంటానని మొక్కుకున్నాడు. వివరాల్లోకి వెళితే కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌కు చెందిన 32 ఏళ్ల నవీన్ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేలేకపోతున్నానని తీవ్ర నిరాశకు లోనయ్యాడు. 


ఈ నేపధ్యంలో తనకు ప్రభుత్వ ఉద్యోగం లభిస్తే జీవితాన్ని త్యాగం చేస్తానని భగవంతుడిని వేడుకున్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే నవీన్‌కు ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం దొరికింది. వెంటనే అతను ముంబై వెళ్లి ఉద్యోగంలో చేరిపోయాడు. అక్కడ 15 రోజుల పాటు ఉద్యోగం కూడా చేశాడు. తరువాత రైలులో త్రివేండ్రం బయలుదేరాడు. మధ్యలో ఒక స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్ మృతదేహం వద్ద పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికింది. దానిలో తాను భగవంతునికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని రాశాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే భగవంతుని దగ్గరకు వచ్చేస్తానని వేడుకున్నానని అందుకోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దానిలో పేర్కొన్నాడు. నవీన్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంనకు తరలించారు. అయితే పోలీసులు ఈ ఉదంతంపై అనుమానం వ్యక్తం చేస్తూ, నవీన్ ఆత్మహత్యకు వేరే కారణాలేవైనా ఉంటాయన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అతని సన్నిహితుల దగ్గరి నుంచి వివిధ వివరాలను తెలుసుకుంటున్నారు. 


Updated Date - 2020-11-01T12:15:59+05:30 IST