చెరువులో మునిగి యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-01-27T05:30:00+05:30 IST
మరో పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందగా, వరసకు సోదరుడైన ఓ బాలుడు గల్లంతయ్యాడు.
బాలుడు గల్లంతు.. చంద్రునాయక్ తండాలో విషాదం
టేక్మాల్. జనవరి 27: మరో పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందగా, వరసకు సోదరుడైన ఓ బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటనతో తండా విషాదం నెలకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చంద్రునాయక్ తండాకు చెందిన గూగులోత్ ప్రవీణ్కుమార్ (20)తో పాటు వరసకు తమ్ముడైన గూగులోత్ శ్రీకాంత్ (12) కలసి గురువారం సాయంత్రం ట్రాక్టర్ను కడిగేందుకు సమీపంలోని అచ్చన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పత్తికుంటకు వెళ్లారు. ట్రాక్టర్ కడుగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఈ కుంటలో గల లోతైన గుంతలోకి జారి పడినట్లు తండావాసులు తెలిపారు. స్థానికులు చెరువులో గాలించగా ప్రవీణ్కుమార్ మృతదేహం లభ్యమైంది. శ్రీకాంత్ కోసం గాలిస్తున్నట్లు తండావాసులు తెలిపారు. గల్లంతైన శ్రీకాంత్కు తల్లిదండ్రులు కూడా లేకపోవడం తండాలో ప్రతీ ఒక్కరిని కలచివేసింది. కాగా ప్రవీణ్కుమార్కు ఫిబ్రవరి 6న వివాహం జరగవలసి ఉందని, ఇంతలోనే ఈ ఘటన జరగడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.