అతి త్వరలో యోగి మంత్రివర్గ విస్తరణ

ABN , First Publish Date - 2021-08-20T21:56:24+05:30 IST

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అతి త్వరలో

అతి త్వరలో యోగి మంత్రివర్గ విస్తరణ

లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అతి త్వరలో తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించబోతున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదకు బ్రాహ్మణ వర్గం ప్రతినిధిగా మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


యోగి ఆదిత్యనాథ్ గురువారం సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో సుమారు 3 గంటలపాటు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ గురించే చర్చించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు చివరి వారంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలిపాయి. 


యోగి కొత్తగా సుమారు ఏడుగురికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. వీరిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు జితిన్ ప్రసాద అని పేర్కొన్నాయి. ఆయనను బ్రాహ్మణ వర్గానికి ప్రతినిధిగా మంత్రివర్గంలో చేర్చుకోబోతున్నారని వివరించాయి. అయితే జితిన్ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ కాకపోవడం ఇబ్బందికరంగా మారిందని తెలిపాయి. మంత్రివర్గ మార్పులు, చేర్పులపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఈ వారాంతంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో లక్నోలో మరొక సమావేశం జరుగుతుందని తెలిపాయి. 


ఉత్తర ప్రదేశ్‌ బ్రాహ్మణులు యోగి ప్రభుత్వంలో తమకు తగిన స్థానం దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. జితిన్ ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. 

 

Updated Date - 2021-08-20T21:56:24+05:30 IST