బీజేపీ పోరుయాత్రకు అడ్డుతగిలిన వైసీపీ నాయకులు
ABN , First Publish Date - 2022-10-03T05:53:57+05:30 IST
ఆదివారం చేపట్టిన ప్రజాపోరు యాత్రకు వైసీపీ నాయకులు, పలువురు గ్రామ వలంటీర్లు అడ్డు తగిలారు.
బొమ్మనహాళ్, అక్టోబరు 2: మండలంలోని దేవగిరి గ్రామంలో బీజేపీ ఆదివారం చేపట్టిన ప్రజాపోరు యాత్రకు వైసీపీ నాయకులు, పలువురు గ్రామ వలంటీర్లు అడ్డు తగిలారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడు గుమ్మడి సత్యనారాయణరెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి యాత్ర చేపట్టారు. సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మళ్లిస్తోందన్నారు. వైసీపీతో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. ఆయన మాట్లాడుతుండగా.. వైసీపీకి చెందిన రామాంజి అనే వ్యక్తి వాహనంపైకి ఎక్కి, అడ్డుకున్నాడు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించవద్దనీ, కేంద్రం పెట్రోల్, డీజిల్ రేట్లు ఎంత పెంచిందో కూడా వివరించాలనీ, బీజేపీ చేస్తున్న మోసాలపై ప్రజలకు తాము కూడా వివరిస్తామని అడ్డు తగిలాడు. వైసీపీకి చెందిన రుద్ర సుంకన్న, శేఖర్, గ్రామ వలంటీర్ మహేష్ మ రికొందరు ప్రజాపోరు యాత్రకు అడ్డు తగిలారని బీజేపీ నాయకులు ఆరోపించారు. వాహనానికి ఉన్న మైకులు, బ్యానర్లు తొలగించారని పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేశారు.