వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

ABN , First Publish Date - 2022-05-16T05:27:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, వీటితోపాటు ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు పిలుపునిచ్చారు.

వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
తెలుగుయువత ప్రాంతీయ సదస్సులో ప్రసంగిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు

ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృత ప్రచారం

జగన్‌రెడ్డిని గద్దె దించడం, చంద్రబాబును సీఎంను చేయడమే ధ్యేయం

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు పిలుపు

విశాఖలో ఉత్తరాంధ్రస్థాయి సదస్సు


విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, వీటితోపాటు ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన తెలుగు యువత ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వస్తే 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రతి ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని గత ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు హామీ ఇచ్చారని అన్నారు. ఆయన (జగన్‌) ముఖ్యమంత్రి అయి మూడేళ్లు అవుతున్నా ఉద్యోగాలను భర్తీ చేయలేదని, కనీసం ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో ఉద్యోగాలు లభించక విద్యావంతులైన యువత ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు యువతకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారని, అనుబంధ కమిటీల్లో 40 శాతం పదవులను యువతకు కేటాయిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడం, జగన్‌రెడ్డిని గద్దె దించడం, టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. 

విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, టీడీపీకి బలం యువతనేని, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, పార్టీ శ్రేణులు అంకితభావంతో పనిచేస్తారని, ఇందుకు యువత బాధ్యత కీలకమైనదని చెప్పారు. అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై కార్యాచరణ రూపొందించి ప్రజలకు వివరించాలన్నారు. 

సదస్సులో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, విశాఖ దక్షిణ, మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జిలు గండి బాబ్జీ, పీవీజీ కుమార్‌, విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, అరకు తెలుగు యువత అధ్యక్షులు ఒలిశెట్టి తాతాజీ, పీబీవీఎస్‌ఎన్‌ రాజు, చైతన్యబాబు, దాసునాయుడు, సుమంత్‌ నాయుడు, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారీ కేక్‌ కట్‌ చేశారు. 



Updated Date - 2022-05-16T05:27:45+05:30 IST