తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీఆర్ ఇకలేరు
ABN , First Publish Date - 2020-11-16T05:26:19+05:30 IST
తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మరాజా (వైటీ రాజా)(71) ఇక లేరన్న వార్త ఆయన అభి మానులు, టీడీపీ శ్రేణులను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది.
తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూత
అక్కడే అంత్యక్రియలు
శోకసంద్రంలో అభిమా నులు, టీడీపీ శ్రేణులు
చంద్రబాబు సహా, ప్రముఖుల నివాళులు
తణుకు, నవంబరు 15 : తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మరాజా (వైటీ రాజా)(71) ఇక లేరన్న వార్త ఆయన అభి మానులు, టీడీపీ శ్రేణులను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందు తూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడవడంతో కుటుంబసభ్యులు, బంధువులు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అక్కడి మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిం చారు. ఆయనకు భార్య నారాయణమ్మ, ఇద్దరు కుమార్తెలు అవంతి, రాజేశ్వరి, కుమారుడు అవినాష్ ఉన్నారు. గుంటూరు జిల్లా కారంచేడులో జాగర్లమూడి గంగాభవాని, చంద్రమౌళిలకు జన్మించిన రాజా తణుకులోని యలమర్తి నారాయణరావుచౌదరి, రాజేశ్వరీదేవిలకు దత్తతగా వచ్చారు. రాజేశ్వరి దేవి పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ సోదరీమణి. వైటీఆర్ హైదరాబాద్, విజయవాడలలో ప్రాథమిక విద్యను, బెంగళూరులో మెకానికల్ ఇంజనీరింగ్ను పూర్తిచేశారు. హరిశ్చంద్రప్రసాద్ కుమార్తె నారాయణమ్మతో రాజాకు వివాహం చేశారు. ఆయన సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్కు బావమరిది. రాజా ప్రస్తుతం జయలక్ష్మి ఫెర్టిలైజర్స్కు ఎండీగా వ్యవహరిస్తుండగా, వైజాగ్లోని ప్రత్యూష కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ను స్థాపించారు.
ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వైటీఆర్ అనేక పదవులు చేపట్టారు. పార్టీపరంగా 1982–84లో కొవ్వూరు అసెంబ్లీ, ఏలూ రు పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల బాధ్యతలను తలకె త్తుకున్నారు. 1989–1997 మధ్య పార్టీ తణుకు పట్టణ అధ్యక్షుడిగా, 1995 నుంచి 2005 వరకూ మున్సిపల్ వైస్ ఛైర్మన్గా పనిచేశారు. 1999–2004 మధ్య ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వ హించిన సమయంలో జన్మభూమి స్ఫూర్తిగా తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రూ.2 కోట్ల ప్రజా విరాళం, పూర్వ విద్యార్థుల సహకారం తో నూతన భవనాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి నిర్మాణంలోను ఆయన పాత్ర మరువలేనిది. తణుకు నియోజకవర్గంలో ఉం డే పెంటపాడు, ఉండ్రాజవరం మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తణుకు కోపరేటివ్ కన్స్యూమర్స్ స్టోర్స్ అధ్యక్షుడిగా, జిల్లా సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ రాజకీయంగా కార్యకర్తలకు, నాయకులకు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. నేటితరం ఎంతోమంది నాయకులను ప్రోత్సహించారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలో సింగపూర్ నుంచి వచ్చిన ఆరిమిల్లి రాధాకృష్ణను పరిచయం చేసి, తణుకు నుంచి పోటీ చేయించి గెలిపించిన ఘనత ఆయనదే. నిడదవోలులో బూరుగుపల్లి శేషారావును రాజకీయంగా ప్రోత్సహించి ముందుకు నడిపించారు. వైటీఆర్ ఇక లేరన్న వార్త తణుకు నియోజకవర్గ ప్రజలతో పాటు ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు శోకసంద్రంలో ముంచేసింది. వివాదరహితుడిగా, ముక్కుసూటిగా వ్యవహరించే ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన మృతికి సంతాపంగా తణుకులోని అన్ని దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి నివాళులర్పించారు.
ఇలాంటి నేతలు అరుదు : చంద్రబాబు
‘వైటీఆర్ మరణం విచారకరం. రాజాలాంటి నేతలు అరు దుగా ఉంటారు. నిరంతరం ప్రజా సేవలోనే జీవితం కొనసా గించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోట’ంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. వైటీ రాజా మృతి తీవ్ర దిగ్ర్భాంతి కలిగిం చింది. మంచి మిత్రుడిని కోల్పోయా అని శాసనమండలి చైర్మ న్ ఏంఏ షరీఫ్ సంతాపం వెలిబుచ్చారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మంతె న సత్యనారాయణరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ రరావు, టీడీపీ నేతలు తోట సీతారామలక్ష్మి సంతాపం తెలిపా రు. ‘ఆదర్శవంతమైన జీవితం గడిపిన వైటీ రాజా మరణం పార్టీకే కాదు.. అందరికీ తీరని లోటే’ అంటూ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. 2014 ఎన్నికల్లో తనను తణుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించడం లో కీలకపాత్ర పోషించారన్నారు.
మాకు ఆప్తుడు :తోట సీతారామలక్ష్మి, టీడీపీ అధ్యక్షురాలు
వైటీఆర్ మాకు అత్యంత ఆప్తుడు. మృతి వార్త మనోవేదనకు గురి చేసింది. ఇప్పటి వరకూ ఆయనంత క్రమశిక్షణ కలిగిన నాయకుడిని చూడలేదు.మనందరినీ దుఃఖ సాగరంలో ముంచి వెళ్లిపోయిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నా.
అకాల మరణం బాధాకరం : కారుమూరి, ఎమ్మెల్యే
నాయకుడిగా, పారిశ్రామికవేత్తగా అనేక మందికి ఉపాధిని కల్పించి, తనదైన శైలిలో ముద్రవేసుకున్నారు. ఆయన మృతి తణుకు ప్రజలకు తీరని లోటు..ఆయన అకాల మరణం బాధాకరం.
వైటీఆర్ ఆశయాలు కొనసాగించాలి : శేషారావు, మాజీ ఎమ్మెల్యే
వైటీ రాజా ఆశయాలను కొనసాగించడం ద్వారా ఆయనకు ఘనమైన నివాళి అర్పించినట్టు అవుతుంది. తణుకు, నిడదవోలు నియోజకవర్గాలకు ఎలాంటి సమస్య వచ్చిన పెద్దరికంతో పరిష్కరించేవారన్నారు.
తుదిశ్వాస వరకూ టీడీపీలోనే : ఎంవీ.కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే
తెదేపా ఆవిర్భావం నుంచి తుది శ్వాస వరకూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి వైటీఆర్.రాజా లాంటి వ్యక్తి రాష్ట్రంలోనే లేరని అన్నారు.
మంచి నాయకుడిని కోల్పోయాం : పాందువ్వ శ్రీను, ఎమ్మెల్సీ
క్రమశిక్షణ గల నాయకుడిని కోల్పోయాం. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం ఆయనకే సొంతం. ఎంతో మంది కార్మికులకు జీవనోపాధి కల్పించిన సంఘటనలు ఉన్నాయి.
టీడీపీకి తీరనిలోటు : పాలి ప్రసాద్, టీడీపీ జిల్లా కార్యదర్శి
వైటీఆర్ అకాల మరణం టీడీపీకి తీరని లోటు. ఆయన పార్టీకి ఎన్నో సేవలందించారు. చివరి వరకూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసినటువంటి ఉన్నత వ్యక్తి. ఆయన మరణం పార్టీకి తీరని లోటు.
నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఆయనే : ఆరిమిల్లి
2014 ఎన్నికల్లో తణుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను నిలబెట్టడంతో కీలకపాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సింగపూర్లో స్థిరపడిన తనను రాజకీయాల్లోకి తెచ్చి 2013లో పాదయాత్రలో భాగంగా తణుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలంటూ వైటీరాజా చంద్రబాబును కోరారని..వెంటనే చంద్రబాబు ఆమో దించారన్నారు.30 వేల మెజార్టీ గెలుపులో కీలకపాత్ర వైటిఆర్దేనన్నారు.2019 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి అండగా నిలబడ్డారన్నారు.
మూడు రోజులు నివాళులు
మాజీ ఎమ్మెల్యే వైటి రాజా మృతి పట్ల నియోజకవర్గంలో మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. సోమవారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో, మంగళవారం మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలోనూ, బుధవారం వైటి రాజా ఆత్మకు శాంతి చేకూర్చాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించాలని సూచించారు.