రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2022-05-23T06:22:27+05:30 IST

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఘటనా స్థలిలో స్వర్ణ మృతదేహం

ఇద్దరు చిన్నారులకు గాయాలు

కొమ్మాది, మే 22: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన గొర్లె అర్జునరావు సబ్బవరంలోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఆర్ట్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య స్వర్ణ వీఎంఆర్డీఏ (వుడా) పార్కులో టికెట్‌ కలెక్టర్‌గా అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తోంది. వీరు సబ్బవరంలోని జోడుగుళ్లప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో అర్జునరావు సొంతూరైన బుడతనాపల్లికి భార్య స్వర్ణ, ఎనిమిదేళ్ల కుమార్తె భవ్యశ్రీ, నాలుగేళ్ల కుమారుడు అభినవ విద్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుండగా మారికవలస పెట్రోల్‌ బంక్‌ వద్ద వీరి వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొంది. దీంతో కింద పడిపోయిన స్వర్ణ (30) అక్కడికక్కడే మృతి చెందగా, పిల్లలిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. అర్జునరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవికుమార్‌ పేర్కొన్నారు.


Updated Date - 2022-05-23T06:22:27+05:30 IST