5 నెలల్లో 31 సార్లు కరోనా
ABN , First Publish Date - 2021-01-24T07:55:22+05:30 IST
రాజస్థాన్కు చెందిన శారదా దేవి (35)కి గత 5 నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. గతేడాది ఆగస్టులో ఆమె రాజస్థాన్లోని భరత్పూర్లో అప్నా ఆశ్రమ్కు వెళ్లారు...
జైపూర్, జనవరి 23: రాజస్థాన్కు చెందిన శారదా దేవి (35)కి గత 5 నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. గతేడాది ఆగస్టులో ఆమె రాజస్థాన్లోని భరత్పూర్లో అప్నా ఆశ్రమ్కు వెళ్లారు. ఆశ్రమానికి కొత్తగా వచ్చినందున నిర్వాహకులు ఆమెకు సెప్టెంబరు 4న తొలిసారి పరీక్ష చేయించ గా.. పాజిటివ్ వచ్చింది. 14 రోజులు ఐసోలేషన్లో ఉంచి చికిత్స చేయించిన తర్వాత మళ్లీ పరీక్ష చేయిస్తే.. మళ్లీ పాజిటివే వచ్చింది. ఒకటి కాదు..రెండు కాదు.. మొత్తం 17 సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్ష, 14సార్లు యాంటీజెన్ పరీక్ష చేయించారు. చివరిసారిగా జనవరి 7న టెస్టు చేయించినా పాజిటివే వచ్చింది. ఆమెకు అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం.. ఇలా మూడు రకాల చికిత్సలూ చేయించారు. ఏ చికిత్స చేయించినా టెస్టులో ఫలితం మాత్రం మారలేదు. దీంతో ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కాక వైద్యులు తల పట్టుకుంటున్నారు. విచిత్రమేంటంటే.. పదేపదే పాజిటివ్ వస్తు న్నా ఆమెలో ఎలాంటి అనారోగ్య లక్షణాలూ లేవు. పైగా గత 5 నెలల్లో ఆమె 7-8 కిలోల బరువు కూడా పెరిగారని ఆశ్రమానికి చెందిన వైద్యుడు డాక్టర్ బీఎం భరద్వాజ్ తెలిపారు. ఆశ్రమానికి వచ్చిన కొత్తల్లో ఆమె చాలా బలహీనంగా ఉండేవారని, నిలబడే ఓపిక కూడా ఉండేది కాదని వెల్లడించారు. ఆమెకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్లే ఇన్నిసార్లు పాజిటివ్ వచ్చిందని వైద్యులు భావిస్తున్నారు.