వైద్యం అందక ప్రాణం పోయింది.. ఆక్సీజన్ కోసం గంటపాటు అవస్థ
ABN , First Publish Date - 2020-07-08T22:01:47+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రభుత్వ వైద్యశాలకు వైద్యులను నియమించాలని మీడియా, స్థానికులు ఎంత కోరినా భద్రాద్రి జిల్లా వైద్యశాఖ
ఊపిరాడక అస్వస్థత.. చర్ల వైద్యశాలకు తరలింపు
108 సిబ్బంది ఉన్నా పట్టించుకోని వైనం
చర్ల/భద్రాద్రి (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రభుత్వ వైద్యశాలకు వైద్యులను నియమించాలని మీడియా, స్థానికులు ఎంత కోరినా భద్రాద్రి జిల్లా వైద్యశాఖ అధికారులు పట్టించుకోపోవడంతో సకాలంలో వైద్య అందక ఓ గిరిజన మహిళ మృతి చెందింది. చర్ల మండల కేంద్రానికి చెందిన గుర్రాల లక్ష్మీకాంతం (50) సోమవారం రాత్రి అస్వస్థతకు గురైంది. ఊపిరాడక ఇంటి ఆవరణలో పడిపోయింది. కుటుంబ సభ్యులు గమనించి చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్టాప్ నర్సులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆక్సిజన్ పెట్టాలని, వైద్యులని పిలవాలని కుటుబ సభ్యులు కోరారు.
అయితే వైద్యులు, ఆక్సిజన్ లేదని సిబ్బంది తెలిపారు. దీంతో 108లో ఉన్న ఆక్సిజన్ అయినా పెట్టాలని అక్కడ ఉన్న 108 సిబ్బందిని వారు కోరారు. కానీ అందులో ఆక్సిజన్ లేదని 108నిర్వాహకుడు తెలిపాడని కుటుంబ సభ్యులు గుర్రాల విజయ్, చిన్నా తెలిపారు. గట్టిగా నిలదీయడంతో ఆక్సిజన్ పెడతానని సదరు 108 సిబ్బంది తెలిపాడని వారు వాపోయారు. అప్పటికే గంట సమయం వృథా కావడంతో తమ తల్లి చనిపోయిందని తెలిపారు. చర్ల ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న సిబ్బంది, 108 సిబ్బంది సకాలంలో స్పందిచి ఉంటే ప్రాణం నిలిచేదని ఆవేదన వ్యక్తం చేశారు.