అప్పు చెల్లిస్తావా... లాక్కెళ్లాలా?
ABN , First Publish Date - 2022-08-20T05:03:32+05:30 IST
తీసుకున్న అప్పు చెల్లిస్తావా, కారులో వేసుకుని లాక్కెళ్లాలా అంటూ సీడ్ ఆర్గనైజర్ అనుచరులు రైతు, సబ్ ఆర్గనైజర్పై దౌర్జన్యం చేశారు.
- సబ్ ఆర్గనైజర్పై సీడ్ ఆర్గనైజర్ అనుచరుల దాడి
- రక్షణ కల్పించాలని వేడుకుంటున్న రైతు కుటుంబం
గట్టు, ఆగస్టు 19 : తీసుకున్న అప్పు చెల్లిస్తావా, కారులో వేసుకుని లాక్కెళ్లాలా అంటూ సీడ్ ఆర్గనైజర్ అనుచరులు రైతు, సబ్ ఆర్గనైజర్పై దౌర్జన్యం చేశారు. అతడి పొలం వద్దకు వెళ్లి వీరంగం సృష్టించారు. గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధిం చిన వీడియో వైరల్ అయ్యింది. ఈ మేరకు బాధిత రైతు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వీరన్న మేకల సోంపల్లి గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి అనే సీడు ఆర్గనైజర్కు సబ్ ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్నాడు. తీసుకున్న అప్పులను రైతులు చెల్లించకపోవడంతో ఆర్గనైజర్ వీరన్నపై ఒత్తిడి చేశాడు. దీంతో రైతుల దగ్గర అప్పులు వసూలు చేసి ఇచ్చేశాడు. అయితే తనకు రావాల్సిన కమిషన్ అడిగితే, నువ్వే బాకీ ఉన్నావంటూ ఆర్గనైజర్ తప్పుడు లెక్కలు చూపి స్తున్నాడని బాధితుడు వీరన్న ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తాను పొలం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా, రమేష్ రెడ్డి అనుచరులు పెద్ద రాజు, బిజ్జారం తిమ్మప్ప, పద్మారావ్లు గొడవ చేశారని, భార్యా పిల్లలను బెదిరించారని తెలిపారు. ఈ విషయంపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, తన ఫోన్ లాక్కొని దుర్భాషలాడారని ఆరోపించారు. ఈ విషయంపై గట్టు ఏఎస్ఐ రామ్చంద్రజీని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ఫిర్యాదు అందిందని, విచారిస్తామని చెప్పారు.