ఆమె పారిపోలేదు... క్లారిటీ ఇచ్చిన కర్నాటక ప్రభుత్వం...

ABN , First Publish Date - 2020-03-15T16:22:27+05:30 IST

కరోనా వైరస్ సో్కిన గూగుల్ టెకీ భార్య బెంగళూరు నుంచి పారిపోయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం...

ఆమె పారిపోలేదు... క్లారిటీ ఇచ్చిన కర్నాటక ప్రభుత్వం...

బెంగళూరు: కరోనా వైరస్ సోకిన గూగుల్ టెకీ భార్య బెంగళూరు నుంచి  పారిపోయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని కర్నాటక ప్రభుత్వం వివరణ ఇచ్చంది.  తన భర్తకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగానే ఆమెను కూడా క్వారెంటైన్ చేశారనీ.. అయితే ఆమె బెంగళూరు నుంచి పారిపోయిందంటూ వార్తలు వచ్చాయి. బెంగళూరు నుంచి విమానంలో నేరుగా ఢిల్లీకి, అక్కడి నుంచి  ఆగ్రాకి వెళ్లిందని వార్తలు వచ్చాయి. అయితే ఆమె తన భర్తకు కోవిడ్-19 సోకినట్టు తేలక ముందే బెంగళూరు నుంచి వెళ్లిందనీ... ఆమెను అపార్థం చేసుకుంటూ రకరకాల వార్తలు వచ్చాయని కర్నాటక వైద్య విద్యా మంత్రి కే. సుధాకర్ పేర్కొన్నారు. గత నెల్లోనే ఈ యువదంపతులకు వివాహమైంది. హనీమూన్‌ కోసం వీరిద్దరూ ఇటీవల యూరోప్‌కు వెళ్లివచ్చారు. ఇటలీ, గ్రీస్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో పర్యటించి నెలాఖర్లో తిరిగివచ్చారు. ఇవాళ మంత్రి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ... 


‘‘మార్చి 8న వాళ్లిద్దరూ ముంబై నుంచి బెంగళూరు వచ్చారు. అదే రోజు రాత్రి 1:50కు ఆమె విమానాశ్రయం నుంచి  బయల్దేరి మార్చి 9న ఢిల్లీ చేరుకుంది. అక్కడి నుంచి ఆగ్రా వెళ్లింది. ఆ తర్వాతి రోజు విధులకు హాజరైన భర్త అస్వస్థతకు గురికావడంతో... వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. 12 తేదీ నాటికి కరోనా తుది రిపోర్టులు వచ్చాయి. కాబట్టి ఆమె పారిపోయిందని చెప్పడం తప్పే అవుతుంది..’’ అని పేర్కొన్నారు.  ఆమె వెళ్లిన 9 తేదీన కూడా భర్త బాగానే ఉన్నాడనీ.. కరోనా లక్షలేవీ కనిపించలేదని డాక్టర్ సుధాకర్ పేర్కారు. మరోవైపు భర్త ఆస్పత్రిలో చేరినప్పుడు తన భార్య ప్రయాణ వివరాలు స్పష్టంగా చెప్పలేకపోయారనీ.. అందుకే ఆమె ఎందుకు ముంబై నుంచి బెంగళూరు వచ్చిందీ, మళ్లీ తిరిగి ఢిల్లీ ఎందుకు వెళ్లింది ఆర్థం కాలేదని మంత్రి పేర్కొన్నారు. ‘‘టెకీ భార్య బెంగళూరులో అడుగుపెట్టలేదు. ఆమె ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సి వుండొచ్చు. అయితే తన భర్తను బెంగళూరులో దించి గుడ్‌బై చెప్పేందుకే వచ్చివుంటుంది...’’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం గూగుల్ టెకీకి చికిత్స జరుగుతుండగా.. భార్యకు కూడా కరోనా సోకినట్టు ప్రాథమిక పరీక్షల ద్వారా నిర్ధారించారు. అయితే తుది పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదు.  ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు యూపీ ప్రభుత్వం ఇంకా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మంత్రి సుధాకర్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-15T16:22:27+05:30 IST