అడ్డొస్తుందని..అంతమొందించాడు!

ABN , First Publish Date - 2021-08-04T05:36:25+05:30 IST

వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతుందనే కోపంతో భార్యను హతమార్చాడు ఓ కిరాతకుడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అడ్డొస్తుందని..అంతమొందించాడు!

ముమ్మిడివరం, ఆగస్టు 3: వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతుందనే కోపంతో భార్యను హతమార్చాడు ఓ కిరాతకుడు.   పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నక్కావారిపేటకు చెందిన కాశి రవీంద్రకు 14 ఏళ్ల క్రితం ఉప్పలగుప్తం మండలం గోపవరానికి చెందిన అంబటి దుర్గాఈశ్వరి(32)తో వివాహమైంది. వారికి  భరత్‌ (12), శరత్‌ (9) అనే పిల్లలు ఉన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ చెత్త తరలించే ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న రవీంద్ర కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగినిగా పనిచేస్తున్న మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మద్యానికి బానిసై భార్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. వివాహేతర సంబంధంపై భర్తను  ఈశ్వరి చాలా సార్లు నిలదీసింది.  ఈ క్రమంలో సోమవారం రాత్రి 10 గంటలైనా భర్త రాకపోవడంతో ఈశ్వరి ఫోన్‌ చేసింది. ఫోన్‌లోనే వాగ్వాదం జరిగింది. దీంతో విసుగుచెందిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ భర్తను హెచ్చరించి ఇంటి నుంచి సుమారు 200 మీటర్ల దూరం వచ్చేసరికి భర్త ఎదురుపడ్డాడు. దీంతో వారిద్దరి మధ్య మరోసారి వివాదం జరగగా రవీంద్ర భార్యను బలవంతంగా కిందకు నెట్టి రోడ్డుకేసి ముఖాన్ని కొట్టడంతో ఆమె మృతిచెందింది. మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న కాల్వలో పడవేసి ఇంటికి వెళ్లి నిద్రించి,  మంగళవారం ఉదయం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అమలాపురం డీఎస్పీ ఎం.మాధవరెడ్డి, సీఐ ఎం.జానకీరామ్‌, ఎస్‌ఐ కె.సురేష్‌బాబు ఆధ్వర్యంలో శవపంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ ఎం.జానకీరామ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ కె.సురేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-04T05:36:25+05:30 IST