బీమా ఎందుకు చెల్లించరు?
ABN , First Publish Date - 2022-08-04T05:10:03+05:30 IST
కుటుంబ సభ్యుడ్ని కోల్పోయి ఎనిమిది నెలలైనా బీమా అందలేదని, చెల్లించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని విద్యుత్ ప్రమాదంలో మృతిచెందిన బేతనపల్లి కిరణ్(35) భార్య, తల్లి బుధవారం ఎమ్మెల్యేను నిలదీశారు.
ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళ
బాడంగి, ఆగస్టు 3: కుటుంబ సభ్యుడ్ని కోల్పోయి ఎనిమిది నెలలైనా బీమా అందలేదని, చెల్లించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని విద్యుత్ ప్రమాదంలో మృతిచెందిన బేతనపల్లి కిరణ్(35) భార్య, తల్లి బుధవారం ఎమ్మెల్యేను నిలదీశారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు బుధవారం గొల్లాది గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్తుండగా కిరణ్ భార్య సునీత, తల్లి సత్తెమ్మలు ఎమ్మెల్యే వద్దకు వచ్చి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ బీమా కోసం దరఖాస్తు చేసుకొని ఎనిమిది నెలలు కావొస్తున్నా అందలేదని, ఏ కారణంతో చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఇదే టీడీపీ హయాంలో అయితే 21 రోజుల్లో సాధారణ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద మరణానికి రూ.5 లక్షలు గతంలో వచ్చాయని, ఈ ప్రభుత్వంలో బీమా పరిహారం పెంచినట్లు చెబుతున్నారని, కానీ అందజేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామానికి చెందిన మమ్ముల సత్యనారాయణ ఎమ్మెల్యే వద్దకు వచ్చి తనకు 62 సంవత్సరాలు వచ్చినప్పటికీ వృద్ధాప్య పింఛను మంజూరు చేయలేదని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ప్రయోజనం ఉండడం లేదని వాపోయాడు.