ఫిర్యాదుకు ముందే కునాల్ కమ్రాపై నిషేధమా: ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
ABN , First Publish Date - 2020-02-25T21:37:07+05:30 IST
స్టాండప్ కమెడియన్ కునాల్పై ఎటువంటి ఫిర్యాదూ రాకమునుపే అతడిపై విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎందుకు విధించారని ఇండిగో ఎయిర్ లైన్స్ను ఢిల్లీ హై కోర్టు ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై ఎటువంటి ఫిర్యాదూ రాకమునుపే విమానాల్లో ప్రయాణించకుండా అతడిపై నిషేధం ఎందుకు విధించారని ఇండిగో ఎయిర్ లైన్స్ను ఢిల్లీ హై కోర్టు ప్రశ్నించింది. ఇండిగో తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ సుప్రీం కోర్టును కునాల్ ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండిగో విధించిన నిషేధంపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని పౌరవిమానయాన శాఖను కూడా కోరింది. కాగా.. న్యాయమూర్తి ప్రశ్నపై స్పందించిన ఇండిగో తరఫు న్యాయవాది.. న్యాయస్థానం కోరితే ఇండిగో బోర్డు మీటింగ్లో చర్చించిన అంశాల్ని కోర్టుకు నివేదిస్తామన్నారు. అయితే ఏ ఫిర్యాదు ఆధారంగా నిషేధం విధించారో ఇండిగో తెలియపరచాల్సి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇండిగోతో పాటు స్పైస్ జెట్, గోఎయిర్, ఎయిర్ ఇండియా సంస్థలు కునాల్పై ఆరు నెలల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఫ్లైట్లో ప్రముఖ జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామిని ఇబ్బంది పెట్టాడన్న కారణంతో కునాల్ కమ్రాపై వివిధ సంస్థలు నిషేధం విధించాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు.