జాతీయ పతాకావిష్కరణలో ప్రధానికి సహకారం.. ఎవరీ శ్వేతా పాండే?
ABN , First Publish Date - 2020-08-16T04:32:33+05:30 IST
74వ స్వాంతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఎర్రకోటపై జాతీయ..
న్యూఢిల్లీ: 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న సందర్భంగా మహిళా సైనికాధికారి శ్వేతా పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె గురించి తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా విశేష ఆసక్తి వ్యక్తమైంది. మేజర్ శ్వేతా పాండే భారత ఆర్మీ 505 బేస్ వర్క్షాప్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల సిటీ మాంటిస్సోరీ స్కూల్ (సీఎంఎస్)లో ఆమె విద్యాభ్యాసం చేశారు. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్(సీబీఆర్ఎన్) నిపుణురాలిగా గుర్తింపు పొందిన శ్వేత... మహారాష్ట్రలోని పుణే మిలటరీ ఇంజనీరింగ్ కాలేజీ (సీఎంసీ) నుంచి బేసిక్ సీబీఆర్ఎన్, స్టాఫ్ సీబీఆర్ఎన్ కోర్సులను పూర్తి చేశారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఉన్నప్పుడు ఆమె గర్హ్వాల్ రైఫిల్ మెడల్ కూడా సాధించారు.