పట్టించుకునే వారేరీ..?
ABN , First Publish Date - 2020-07-07T11:04:30+05:30 IST
కోవిడ్-19 బాధితుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది
స్వాబ్ టెస్టులకోసం ఫాతిమా ఆసుపత్రి వద్ద పడిగాపులు
నీళ్లిచ్చే దిక్కులేక పిల్లలు, వృద్ధుల అగచాట్లు
కడప, జూలై 6(ఆంధ్రజ్యోతి): కోవిడ్-19 బాధితుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అవి గాలి మాటలే అని బాధితులు ఆరోపిస్తున్నారు. కరోనా పాజిటివ్ ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకు స్వాబ్ పరీక్షలు నిర్వహించడంలో నిలువెల్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బద్వేలు, రైల్వేకోడూరు, మైదుకూరు, దువ్వూరు ప్రాంతాలకు చెందిన పాజిటివ్ ప్రైమరీ వ్యక్తులను సోమవారం సాయంత్రం స్వాబ్ నమూనాలు సేకరించేందుకు కడప ఫాతిమా కాలేజీలోని కోవిడ్-19 ఆసుపత్రికి పంపించారు.
సాయంత్రం 5.45 గంటలకే ఆసుపత్రి ఆవరణలోకి చేరుకున్నా తమనెవరూ పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ఇక్కడ రాత్రి 8గంటల వరకే స్వాబ్ నమూనాలు సేకరిస్తామని వైద్యులు చెబుతున్నారని, రెండుగంటలు ముందు వచ్చినా తమను పట్టించుకోలేదని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు స్వాబ్ పరీక్షలకు వచ్చారు. కనీసం మంచినీరు, ఆహారం ఇచ్చే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి ఎక్కడ ఉండాలి? హోం క్వారంటైన్కు వెళ్లాలా, ఇక్కడే ఉండాలా అనే విషయాలు చెప్పేవారు లేరని వాపోయారు.