కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన తండ్రి.. ఫోన్లో వచ్చిన ఓ మెసేజ్ చూసి షాక్..!
ABN , First Publish Date - 2022-02-16T22:43:30+05:30 IST
తమ కూతురు ఉదయం నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు..
తమ కూతురు ఉదయం నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు.. కొద్ది సేపటికి అతని మొబైల్కు ఓ ఫొటో వచ్చింది.. కూతురి పెళ్లి ఫొటో చూసి ఆ తండ్రి షాకయ్యాడు.. తన పక్కింటి యువకుడినే పెళ్లి చేసుకున్నట్టు తెలుసుకుని నిర్ఘాంతపోయాడు.. వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు.. ఇరు వర్గాల మధ్య కొట్లాటలు జరిగాయి.. తిరిగి అందరూ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు.. మధ్యప్రదేశ్లోని కంద్వాలో ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్లోని కంద్వాకు చెందిన వైష్ణవి అనే యువతి అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సంతోష్తో కొద్ది కాలంగా ప్రేమలో ఉంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే సంతోష్ పేద కుటుంబానికి చెందిన వాడు కావడం, ఉద్యోగం లేకపోవడంతో వైష్ణవి తండ్రి ప్రేమ్లాల్ ఆ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మంగళవారం ఇంటి నుంచి పరారైన వైష్ణవి అదే రోజు సంతోష్ను ఓ గుడిలో వివాహం చేసుకుంది. కూతురు ఉదయం నుంచి కనిపించకపోవడంతో ప్రేమ్లాల్ స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రేమ్లాల్ సోదరుడు వైష్ణవి పెళ్లి ఫొటోను పంపించాడు.
ఆ ఫొటో చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రేమ్లాల్ నేరుగా సంతోష్ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. సంతోష్ను తీవ్రంగా కొట్టాడు. దీంతో సంతోష్ బంధువులు ప్రేమ్లాల్ కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఇరు వర్గాలకు తీవ్ర గాయాలు కావడంతో అందరూ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. పోలీసులు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.