కాగితపు పులా? సర్కస్ పులా? సింధియాకు కమల్ నాథ్ చురక
ABN , First Publish Date - 2020-07-04T00:36:16+05:30 IST
బీజేపీ యువనేత జ్యోతిరాదిత్య సింధియాపై మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
భోపాల్ : బీజేపీ యువనేత జ్యోతిరాదిత్య సింధియాపై మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. బతికుంది పేపర్ టైగరా? సర్కస్ టైగరా? చెప్పాలంటూ సింధియాకు చురకలంటించారు. అలాగే సీఎం శివరాజ్ పై కూడా సెటైర్లు సంధించారు.
‘‘బతికుంది పేపర్ టైగరా? సర్కస్ టైగరా? తాము టైగర్లమని కొందరు ప్రకటించుకుంటారు. నేను టైగర్ను కాదు. అలాగని చాయ్ కూడా అమ్ముకోలేదు. నేను కమల్నాథ్ను అంతే. నేను టైగర్ను కాదు. పేపర్ టైగర్ను అసలే కాదు. ఎవరు ఏంది అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి’’ అంటూ కమల్నాథ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సీఎం పదవి చేపట్టగానే శివరాజ్ అన్ని హామీలనూ గుప్పించారని, లాక్డౌన్ సమయంలో కూలీలకు ఆర్థిక సాయం ప్రకటించారని గుర్తు చేశారు. తీరా ఆర్థిక సాయం కోసం కూలీలు అటూ ఇటూ తిరగాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి శివరాజ్ తాజాగా కేబినెట్ విస్తరణ చేపట్టారు. అందులో సింహభాగం జ్యోతిరాదిత్య సింధియా అనుచరులకు బెర్త్లు దక్కాయి. దీంతో సింధియా ‘‘పులి ఇంకా బతికే ఉంది’’ అంటూ కాంగ్రెస్కు దీటుగా సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలోనే కమల్నాథ్ పై వ్యాఖ్యలు చేశారు.