పక్కింటావిడ వాట్సాప్ స్టేటస్‌తో బంగారం దొరికింది!

ABN , First Publish Date - 2020-10-31T20:41:27+05:30 IST

బంగారు నగలతో ఫోటో దిగి ఓ మహిళ పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్.. ఏడాది నాటి ఓ చోరీ కేసులో ఆమె కుమారుడు పట్టుబడేందుకు...

పక్కింటావిడ వాట్సాప్ స్టేటస్‌తో బంగారం దొరికింది!

హైదరాబాద్: బంగారు నగలతో ఫోటో దిగి ఓ మహిళ పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్.. ఏడాది నాటి ఓ చోరీ కేసులో ఆమె కుమారుడు పట్టుబడేందుకు కారణమయ్యింది. సదరు మహిళ పెట్టుకున్న నగలు తమ ఇంట్లో పోయినవేనంటూ  బాధితుల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసును ఛేదించారు. 15 నెలల క్రితం హైదరాబాద్‌లోని రాచకొండ పోలీస్ స్టేషన్ పరిథిలోని సాయిపురి కాలనీలో ఈ చోరీ చోటుచేసుకుంది. 2019 జూలై 12న బాధితుడు అంగడి రవికిరణ్ ఓ ఆలయానికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. అయితే తాను తాళం వేయడం మర్చిపోయానని అనుకున్న అతడు.. తీరా బంగారు నగలు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.


కాగా ఇటీవల బాధితుడి పక్కింటావిడ బంగారు నగలు పెట్టుకుని తన వాట్సాప్ స్టేటస్‌లో పోటోలు పెట్టింది. అవి తమ ఇంట్లో చోరీకి గురైన నగల మాదిరిగానే ఉండడంతో రవికిరణ్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. పక్కింటావిడ కుమారుడు పొన్నుగోటి జితేందర్ ఆ నగలను దొంగిలించినట్టు తేలింది. దీంతో అతడిని అరెస్టు చేశారు. ఈ చోరీ గురించి అతడి తల్లికి కూడా తెలిసే ఉంటుందని భావించిన పోలీసులు ఆమెకు కూడా నోటీసులు ఇచ్చారు. 

Updated Date - 2020-10-31T20:41:27+05:30 IST