‘కార్పొరేషన్‌’లకు ఊతమేది..?

ABN , First Publish Date - 2022-05-17T05:13:16+05:30 IST

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు స్వయం ఉపాధి పథకాల ద్వారా సబ్సిడీ అందించేందుకు ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్‌, మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు లేక నిర్వీర్యం అవుతున్నాయి.

‘కార్పొరేషన్‌’లకు ఊతమేది..?

- నిర్వీర్యమవుతున్న బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు

- మూడున్నరేళ్లుగా విడుదల కాని నిధులు

- ప్రతి ఏటా రుణ ప్రణాళికలు లేవు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు స్వయం ఉపాధి పథకాల ద్వారా సబ్సిడీ అందించేందుకు ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్‌, మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు లేక నిర్వీర్యం అవుతున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వానికి ఇవి గుర్తుకు వస్తాయి. ఆఘమేఘాల మీద కొన్ని పథకాలను ప్రకటించి తక్కువ వ్యవధిలోనే దరఖాస్తులను ఆహ్వానించి కొంత మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఏ లక్ష్యం కోసమైతే ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేసిందో దానినే మరిచిపోవడం నిరుద్యోగులకు శాపంగా మారింది. 

రాష్ట్ర ఆవిర్భావం నుంచి రెండుసార్లు..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే బీసీ కార్పొరేషన్‌ ద్వారా పలు పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. 50 శాతం నుంచి మొదలుకుని వంద శాతం వరకు సబ్సిడీ కూడా అమలుచేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా పెద్దఎత్తున స్వయం ఉపాధి పథకాలను అమలు చేసింది. వీటి ద్వారా అనేక మంది బీసీలకు లబ్ధి చేకూరింది. ఆయా బీసీ కులాల కార్పొరేషన్ల ద్వారా కుల సంఘాలకు నిధులు మంజూరు చేసింది. ఎంపిక చేసిన గ్రూపులన్నింటికీ నిధులు విడుదల చేయడంలో తీవ్రంగా జాప్యం చేసింది. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత పెండింగులో ఉన్న యూనిట్లకు సబ్సిడీ సొమ్మును విడుదల చేసింది. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన అదే ఏడాది బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఒక లక్ష, రూ.50వేల రూపాయల విలువైన యూనిట్లను నెలకొల్పేందుకు నిర్ణయించి దరఖాస్తులను స్వీకరించింది. దీంతో అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, 1479 మంది లబ్ధిదారులకు మాత్రమే 50వేల రూపాయల చొప్పున మంజూరు చేసింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. రెండవసారి కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటివరకు మిగలిన లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. ప్రతి ఏటా రుణ ప్రణాళికను రూపొందించాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు బీసీ కార్పొరేషన్‌ ఉందా, లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా కొత్తగా ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చింది లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు కూడా ప్రణాళిక సిద్ధం చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మళ్లీ ఎన్నికలు వస్తేనే గానీ ప్రభుత్వానికి బీసీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలనే విషయం గుర్తుకు వస్తుందనే విమర్శలున్నాయి.

మైనార్టీ కార్పొరేషన్‌ది అదే కథ..

 పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్నట్లుగా మైనార్టీ కార్పొరేషన్‌ కొనసాగుతున్నది. దీనిని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ కార్పొరేషన్‌ను ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖలోనే విలీనం చేశారు. 2015-16 నుంచి చదువుతో పని లేకుండా నిరుద్యోగులుగా ఉన్న వారికి కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 91 యూనిట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ మేరకు యూనిట్లను మంజూరు చేసింది. ఎంపికైన లబ్ధిదారులకు 88లక్షల 80 వేల రూపాయల సబ్సిడీ సొమ్మును విడుదల చేయాల్సి ఉండగా కొందరికి మాత్రమే సబ్సిడీ విడుదల చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి 135 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించారు. ఆ మేరకు దరఖాస్తులను ఆహ్వానించడంతో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. 2018-19లో 11 యూనిట్లు మాత్రమే మంజూరు చేసి గ్రౌండింగ్‌ చేశారు. 2015-16 నుంచి 2018-19వరకు ఎంపికైన లబ్ధిదారుల్లో పలువురికి నేటికి కూడా సబ్సిడీ రాలేదు. దీంతో వాళ్లు కార్యాలయం చుట్టు తిరిగి తిరిగి వేసారిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ప్రతి ఏటా ఇవ్వాలని, పెండింగులో ఉన్న సబ్సిడీ సొమ్మును విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని ఆయా పార్టీల నాయకులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-17T05:13:16+05:30 IST