అధికార పార్టీలో గెలిచీ.. ఏమిటిది?
ABN , First Publish Date - 2022-07-06T07:08:38+05:30 IST
అధికార పార్టీలో గెలిచి.. మంజూరైన పనులను సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని నగరి, నిండ్ర, విజయపురం జడ్పీటీసీ సభ్యులు గాంధీ, మల్లీశ్వరి, రేవతి ఆవేదన వ్యక్తంచేశారు.
మంజూరైన పనులను సద్వినియోగం చేసుకోలేకున్నాం
అధికారులపై నగరి, నిండ్ర, విజయపురం జడ్పీటీసీల ఫిర్యాదు
నగరి/చిత్తూరు కలెక్టరేట్, జూలై 5: అధికార పార్టీలో గెలిచి.. మంజూరైన పనులను సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని నగరి, నిండ్ర, విజయపురం జడ్పీటీసీ సభ్యులు గాంధీ, మల్లీశ్వరి, రేవతి ఆవేదన వ్యక్తంచేశారు. తమ మండలాల్లో ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అధికారులు సహకరించడంలేదన్నారు. ఈ మేరకు మంగళవారం చిత్తూరులో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులుకు ఫిర్యాదుచేస్తూ వినతిపత్రం ఇచ్చారు. ‘ఈ మూడు మండలాలకు జిల్లా పరిషత్ నుంచి 20 లక్షలు మంజూరయ్యాయి. ఫిబ్రవరి 4వ తేదీన జడ్పీసీఈవో పనులు మంజూరు చేసినట్లు ఉత్తర్వులు ఇచ్చారు. వీటిలో రూ.పది లక్షలు పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు.. డ్రైనేజీ పనులకు రూ.పది లక్షలు చొప్పున ఒక్కో మండలానికి మంజూరు చేశారు. అంచనాలువేసి, ఆ పనులు చేపట్టడానికి అగ్రిమెంట్లో చేయడంలో అధికారులు సహకరించడం లేదు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో జడ్పీటీసీల కోసం ప్రత్యేక గదులు ఉండేవని, ఇప్పుడు వాటిని ఇతర అధికారులకు ఇచ్చేసి తమకు లేకుండా చేస్తున్నారని వడమాలపేట, నగరి జడ్పీటీసీలు మురళి, గాంధీ ఫిర్యాదు చేశారు. ఈ విషయమై నగరి ఎంపీడీవో రామచంద్రయ్యను వివరణ కోరగా.. పనులు మంజూరయ్యేంత వరకు జడ్పీకి తాము ప్రపోజల్స్ పంపామని పనులు మంజూరు అయ్యాయని వివరించారు. ఆ తరువాత మిగిలిన పనులు ఇంజనీర్లు చూడాల్సి ఉందని, తనకు సంబంధం లేదన్నారు. జడ్పీటీసీలతో పాటు మంత్రి ప్రత్యేకంగా రూ.20 లక్షల జడ్పీ నిధులను మంజూరు చేయించుకొచ్చారని నిండ్ర ఎంపీడీవో అరుణ తెలిపారు. మంత్రి పనులు పూర్తయ్యాక జడ్పీటీసీ పనులను చేపట్టమని చెప్పినట్లు ఆమె తెలిపారు.