ఆ సమయంలో రక్తస్రావం అధికంగా ఉంటుంది.. ఎందుకు?
ABN , First Publish Date - 2022-03-04T18:48:14+05:30 IST
పీరియడ్స్ సమయంలో అధికంగా రక్తస్రావం అవడానికి హార్మోనుల అసమతుల్యత, అండాశయాల పనితీరు సక్రమంగా లేకపోవడం, యుటెరస్లో
ఆంధ్రజ్యోతి(04-03-2022)
ప్రశ్న: నాకు పదిహేనేళ్ళు. ఎత్తు ఐదడుగుల మూడంగుళాలు, బరువు అరవై నాలుగు కేజీలు. నెలనెలా పీరియడ్స్ సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంది. ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సుమన, హైదరాబాద్
డాక్టర్ సమాధానం: పీరియడ్స్ సమయంలో అధికంగా రక్తస్రావం అవడానికి హార్మోనుల అసమతుల్యత, అండాశయాల పనితీరు సక్రమంగా లేకపోవడం, యుటెరస్లో ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ లాంటివి ఉండటం తదితర కారణాలుండవచ్చు. స్త్రీ వైద్య నిపుణులను సంప్రదించి చికిత్సను పొందాలి. అధిక రక్తస్రావం వల్ల నీరసం, అనీమియా (రక్తహీనత) ఏర్పడవచ్చు. కొన్నిసార్లు పొత్తి కడుపునొప్పి, తలనొప్పి, వికారం, అలసట, డయేరియా, కడుపు ఉబ్బరం మొదలైన లక్షణాలు ఉంటాయి. రక్తహీనతను నివారించడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోజూ ఆకుకూరలు ఏదో ఓ రూపంలో తినాలి. శనగలు, రాజ్మా, బొబ్బర్లు, అలసందలు లాంటి గింజలతో కూరలను కూడా తీసుకోవాలి. ఈ ఆహారంలో ఉండే ఇనుమును మన శరీరం శోషించుకోవడానికి విటమిన్- సి అవసరం. విటమిన్ - సి అధికంగా ఉండే అన్ని రకాల పండ్లు, నిమ్మరసం, పచ్చి క్యాప్సికమ్స్ తీసుకోవాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే చికెన్, చేప, గుడ్లు, అన్ని రకాల పప్పులు, సోయాగింజలు, సోయా ఉత్పత్తులైన పనీర్, మీల్ మేకర్ లాంటివి కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)