పడిపోయిన స్తంభాలు అంతేనా..!
ABN , First Publish Date - 2021-06-23T05:20:13+05:30 IST
గాలీవానకు పదిరోజుల క్రితం కిందపడిపోయిన విద్యుత్ స్తంభాలను అలాగే వదలివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాజుపాళెం, జూన్ 22: గాలీవానకు పదిరోజుల క్రితం కిందపడిపోయిన విద్యుత్ స్తంభాలను అలాగే వదలివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వ్యవసాయ రంగానికి ప్రస్తుతం విద్యుత్ అవసరం లేకపోవడంతో స్తంభాలు కిందపడిపోయిన వాటి గురించి ఎవ్వరూ పట్టించు కోవడంలేదు. ముఖ్యంగా ఆ విద్యుత్లైన్ కింద ప్రస్తుతం విద్యుత్ విని యోగం లేకపోవడంతో సరఫరా లేక స్తంభాలు కిందపడిపోయిన ఎలాంటి నష్టం జరుగలేదు. కాగా కిందపడిపోయిన స్తంభాలను తొలగించడం కాని, మరమ్మతులు చేయడంకాని విద్యుత్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవ డంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజుపాళెం మండల పరిధిలోని తొండలదిన్నె, రాజుపాళెం గ్రామాల నుంచి పంట పొలాల్లో వ్యవసాయ అవసరానికి 30 కేవీ లైన్లు లాగారు. అయితే తొండలదిన్నెలో సబ్స్టేషన్ రావడంతో ఆ 30 కేవీ లైన్తో పనిలేకుండా పోయింది. ఆ లైన్లకు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఇటీవల గాలీవానకు అయిదు స్తంభాలు కిందపడిపోయి దాదాపు రెండు కిలోమీటర్ల మేర పంట పొలాల్లో, రోడ్ల వెంబడి విద్యుత్ వైర్లు విచ్చలవిడిగా పడి ఉన్నాయి దీంతో ఆదారిన వస్తూ పోతున్న విద్యుత్తు అధికారులు వాటిని తొలగించడం చేయకపోవడంతో పంట పొలాల్లో సేద్యాలు చేసేందుకు ట్రాక్టరు వెళ్లేందుకు, పశువుల కాపరులకు ఈ వైర్లు చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా సంబం ధిత అధికారులు స్పందించి కింద పడిపోయిన విద్యుత్ స్తంభాలను పూర్తి గా తొలగించడమా? లేకపోతే మరమ్మతు పనులు చేపట్టి ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా చేయడమో? చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కొత్త స్తంభాలు లేకనే ఇబ్బందులు
ఈ విషయమై రాజుపాళెం మండల విద్యుత్ శాఖ ఇన్చార్జి ఏఈ హరికృష్ణ ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా గాలీవానకు కింద పడిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించడానికి అందుబాటులో కొత్త స్తంభాలు లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ప్రస్తుతం విద్యుత్ కొత్త స్తంభాలు వచ్చా యని రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.