ఆ మొక్కల జాడేది..?
ABN , First Publish Date - 2021-04-20T05:30:00+05:30 IST
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో ప్రతి ఏటా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు.
ఉపాధి హామీలో నాటే మొక్కలపై కానరాని పర్యవేక్షణ
రూ. లక్షల ఖర్చు.... ప్రయోజనం శూన్యం
నీరుగారుతున్న ప్రభుత్వ ఆశయం
ఏలూరు రూరల్, ఏప్రిల్ 20: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో ప్రతి ఏటా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. రహదారులకు ఇరువైపులా ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, చెరువు గట్లు తదితర ప్రాంతాల్లో లక్ష్యానికి మించి మొక్కలు నాటుతున్నారు. కానీ వాటిని సంరక్షించే నాథుడే లేడు. మరోవైపు లక్షలు ఖర్చు పెట్టి మొక్కలు తీసుకొచ్చి వృథాగా పడవేడంతో అవి నాటకుండానే ఎండిపోయాయి. ఇది రూరల్ మండ లంలోని పరిస్థితి. దీంతో గతంలో నాటిన మొక్కల జాడే ఇప్పుడు కనిపించడం లేదు. పాలగూడెంలో రోడ్లకు ఇరు వైపులా నాటేందుకు రెండు నెలల క్రితం సుమారు 200 పైగా కొబ్బరి మొక్కలు తీసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా వాటిని నాటడం మర్చిపోవడంతో అవి ఎండకు పూర్తిగా ఎండిపోయాయి. మేట్లు నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి నెలకొందని గ్రామస్థులు మండిపడుతు న్నారు. గతంలో నాటిన మొక్కల జాడే ఇప్పుడు కనిపించడం లేదు. ఒకటి రెండు చోట్ల కాదు చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఉపాధి హామీలో భాగంగా నాటిన తర్వాత ఆయా మొక్కలకు నీరు పోసే వారే కరువయ్యారు. మొక్కలు ఎండకు ఎండి చనిపోయాయి.
మహిళా సంఘాలు పట్టించుకోలేదు.. గతంలో ఉపాధిహామీ సిబ్బంది ఆధ్వర్యంలో నాటిన మొక్కలకు వేతన దారులు సక్రమంగా సంరక్షణ చేయడం లేదనే ఉద్దేశ్యంతో వెలుగు సిబ్బందికి సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. మహి ళా సంఘాల ద్వారా మొక్కలకు నీరు పోయించవచ్చని ప్రభుత్వం వెలుగుకు అప్పగించింది. చివరకు మహిళా సంఘాలు పట్టించుకోవడం లేదు.
ట్రీ గార్డులు లేవు ..మండలంలో అనేక ప్రాంతాల్లో గ్రామాలకు వెళ్లే రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటారు. చాలా మొక్కలు ప్రస్తుతం ఎండకు ఎండి చనిపోయాయి. గతంలో ప్రతి మొక్కకు ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ట్రీ గార్డులు ఎక్కడా కానరావడం లేదు.
మొక్కల సంరక్షణపై దృష్టి సారిస్తాం
ఇక నుంచి నాటే మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఎండకు ఎండకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీ లో నాటిన మొక్కలు పర్యవేక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం.
– కిషోర్ కుమార్, ఏపీవో