పూడిక ఎక్కడ?

ABN , First Publish Date - 2022-09-02T06:04:52+05:30 IST

జిల్లాలో జగనన్న లే అవుట్‌లలో పనులు ప్రారంభం కాని ఇళ్లు వేల సంఖ్యలో ఉన్నాయి.

పూడిక ఎక్కడ?

రెండేళ్లుగా మట్టి పూడికకు నోచుకోని జగనన్న లేఅవుట్లు
లబ్ధిదారుల ఆవేదన
దృష్టి సారించిన కలెక్టర్‌..  నివేదికల తయారీకి ఆదేశాలు
వర్షాకాలం తర్వాత గృహనిర్మాణ పనులపై దృష్టి


జగనన్న లేఅవుట్లు మట్టి పూడికలపై అధికారులకు మళ్లీ పిలుపులు వచ్చాయి. మట్టి కొరత వల్ల ఈ వేసవిలో అడుగు ముందుకు పడలేదు. లేఅవుట్‌లకు సమీపంలో మట్టి లభ్యత లేదు. పైగా ఎకరం పూడికకు ధర సమస్య అవరోధంగా మారింది. తాజాగా పూడికకు ఐదు కిలోమీటర్ల లోపు మట్టి దొరక్కపోతే తహసీల్దార్‌, ఎంపీడీవో, మునిసిపల్‌ కమిషనర్లు కలిసి ల్యాండ్‌ లెవలింగ్‌ చేయడానికి ఎంత దూరంలో మట్టి దొరుకుతుందో నివేదిక ఇవ్వాలని నాలుగు రోజుల కిందట కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశించారు. లేఅవుట్లలో ఇంకా ప్రారంభం కాని ఇళ్లని వెంటనే మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భీమవరం, సెప్టెంబరు 1 :  జిల్లాలో జగనన్న  లే అవుట్‌లలో పనులు ప్రారంభం కాని ఇళ్లు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు వచ్చాయి. బెస్‌మెంట్‌ స్థాయిలోని గృహాలన్నీ ప్రస్తుతం ముందుకు సాగడం లేదు. బెస్‌మెంట్‌ లెవెల్‌ అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న గృహాలన్నీ రూప్‌క్యాస్టింగ్‌ స్థాయికి తీసుకురావాలని ఆదేశాలు వచ్చాయి. నిత్యం ఇళ్ల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, కేటాయించిన లక్ష్యాలను చేరుకునేలా పనిచేయాలని, లబ్ధిదారులకు నిర్మాణాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండలం వారీగా ప్రతీ రోజు ఎన్ని గృహాలు స్టేజ్‌ కన్వెన్షన్‌ అవుతాయో, ఎన్ని నూతన గృహాలు ప్రారంభం అవుతాయో యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు.  

పూడిక నోచుకోని స్థలాలు
భీమవరం పట్టణ శివారున యనమదుర్రు రోడ్డులో జీఅండ్‌వీ కెనాల్‌ వంతెన సమీపంలో 73.12 ఎకరాలు సేకరించి ఏడాదిన్నర దాటింది. ఇక్కడ 3,833 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉంది. పురపాలక సంఘ పరిధిలో పట్టణంతో పాటు కొత్తగా విలీనమైన తాడేరు, రాయలం, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం, మండలంలోని నరసింహపురంలలో పేదలకు ఈ స్థలాలు కేటాయించారు. మరి ఎప్పుడు పూడుస్తారో.. తమకు గృహా లు ఎప్పుడు నిర్మిస్తారోనని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.
భీమవరంలో పేదల గృహ నిర్మాణం కోసం పట్టణ శివారున నాలుగు చోట్ల 174.54 ఎకరాలు భూమి సేకరించారు. 8,876 మంది పేదలకు ఇళ్లు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం పూడిక 75 శాతం అయింది. గతేడాది కొన్ని ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు.
నరసాపురం అసెంబ్లీ పరిధిలోని మంగళిగుంటపాలెంలో 90 ఎకరాలు గత ఏడాది సేకరించారు. ఇందులో 29 ఎకరాలను మాత్రమే పూడిక చేసి ఇటీవల స్వల్ప సంఖ్యలో ఇళ్ల నిర్మాణ పనులు పనులు చేపట్టారు.
తణుకు పట్టణ పరిధిలో పైడిపర్రు, అజ్జరం, ఆర్టీవో కార్యాలయం రోడ్డు, డీఎల్‌కే రోడ్డు, కాపవరం లేఅవుట్‌లకు రూ.9 కోట్ల 87 లక్షలు 60 వేలు నిధులు కేటాయించినా మట్టి పూడికకు నోచుకులేదు. లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచినా ఏమాత్రం స్పందన లేదు. అయా కాలనీలకు వెళ్లే దారులు వర్షాలకు అధ్వానంగా మారాయి. 

Updated Date - 2022-09-02T06:04:52+05:30 IST