tmc vs bjp: బెంగాలీ గడ్డపై మాటకు మాట.. బీజేపీ వర్సెస్ మమత

ABN , First Publish Date - 2022-08-29T23:09:44+05:30 IST

కోల్‌కతా: బెంగాలీ గడ్డపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్ (Trinamool Congress), ప్రతిపక్ష బీజేపీ (BJP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

tmc vs bjp: బెంగాలీ గడ్డపై మాటకు మాట.. బీజేపీ వర్సెస్ మమత

కోల్‌కతా: బెంగాలీ గడ్డపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్ (Trinamool Congress), ప్రతిపక్ష బీజేపీ (BJP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అవినీతి కేసుల్లో తమ పార్టీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతుండటంతో తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Chief Minister Mamata Banerjee)లో అసహనం పెరిగిపోతోంది. మంత్రి పార్థా చటర్జీ (Partha Chatterjee), పార్టీలో బలమైన నేత అనుబ్రత మండల్‌ (Anubrata Mondal) వంటి వారంతా ఇప్పటికే జైలుపాలవడంతో పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇదే అదనుగా కమలనాథులు మమతపై, తృణమూల్ నేతలపై విమర్శల ఉధృతి పెంచారు. మమతను కుమారి అనాలా లేక శ్రీమతి అనాలా అంటూ బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. 


తృణమూల్ పార్టీ నిండా దొంగలు, దోపిడిదారులేనని బీజేపీ నేతలు ఆరోపిస్తుడటంతో మమత ఎదురుదాడి ప్రారంభించారు. తాను రాజకీయాల్లో లేకుంటే బీజేపీ నేతల నాలుకలు చీరేసేదాన్నంటూ మమత వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నాయకులంతా దొంగలు, దోపిడిదారులైతే బీజేపీ నేతలు మాత్రం పవిత్రులా అని మమత ప్రశ్నిస్తున్నారు. సీబీఐ, ఈడీ, ఐటీల ద్వారా కమలనాథులు ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. వ్యతిరేకించే ప్రభుత్వాలన్నింటినీ బీజేపీ నేతలు అవినీతి సొమ్ముల ఎరచూపి పడగొడ్తున్నారని మమత ఆరోపించారు. కమలం పార్టీ కుయుక్తులను తిప్పికొట్టి రానున్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. 




2024కు ఇంకా చాలా సమయమున్నా బెంగాలీ గడ్డపై రాజకీయాలు ఊపందుకున్నాయి. ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టకుండా రాజకీయంగా దెబ్బతీసేందుకు పార్టీలు వాడుకుంటున్నాయి. బెంగాల్ రాజకీయాలు మున్ముందు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2022-08-29T23:09:44+05:30 IST