సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాడతాం
ABN , First Publish Date - 2022-08-14T05:10:15+05:30 IST
పోరుమామిళ్లలోని రంగసముద్రం పంచాయతీ పరిధిలో తిరుపతిరెడ్డి కాలనీ వాసులకు పట్టాలు వచ్చేంత వరకు, ఇతర సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదని సీపీఐ జిల్లా కార్యదదర్శి ఈశ్వరయ్య పేర్కొన్నారు.
పోరుమామిళ్ల, ఆగస్టు 13 : పోరుమామిళ్లలోని రంగసముద్రం పంచాయతీ పరిధిలో తిరుపతిరెడ్డి కాలనీ వాసులకు పట్టాలు వచ్చేంత వరకు, ఇతర సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదని సీపీఐ జిల్లా కార్యదదర్శి ఈశ్వరయ్య పేర్కొన్నారు. శనివారం సాయంత్రం సీపీఐ మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది అధికారులు మారినప్పటికీ 8 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నా రెవెన్యూ అధికారులు ఆంక్షలు విధించడం తప్ప న్యాయం చేయడంలో విఫలమయ్యారన్నారు. కలెక్టర్లకు, ఆర్డీవోలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. మండలంలో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు స్మశానాలు, ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఒకటిన్నర సెంటు కోసం అధికారులకు ఎన్నోమార్లు మొరపెట్టుకున్నా వారు నుంచి స్పందన కరువైందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అబ్దుల్ ఖాదర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్, పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.