చి‘వరి’కి ఇంతేనా?

ABN , First Publish Date - 2021-04-07T05:38:12+05:30 IST

‘ఈ ఏడాడి రబీకి పుష్కలంగా సాగునీరందిస్తాం. ముందస్తుగానే గొట్టా బ్యారేజీలో నీటి నిల్వలు ఉంచాం. శివారు ఆయకట్టుకూ తడులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం’..ఇలా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో ఎడమ ప్రధాన కాలువ పరిధిలో రైతులు వరి సాగుచేశారు. తీరా పంట పక్వానికి వచ్చే సమయంలో నీరు అందించలేక అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులు వ్యవప్రయాసలతో సాగుచేసిన వరి పనలను పశుగ్రాసానికి వినియోగిస్తున్నారు.

చి‘వరి’కి ఇంతేనా?
రావివలసలో ఎండిపోయిన వరి పనలను కోస్తున్న రైతులు




వంశధార కాలువ పరిధిలో వేలాది ఎకరాల్లో వరి సాగు

నీరందక ఎండిపోతున్న ‘రబీ’ పంట

పశుగ్రాసంగా వినియోగం

అధికారుల అనాలోచిత నిర్ణయమే కారణం

(టెక్కలి రూరల్‌)

‘ఈ ఏడాడి రబీకి పుష్కలంగా సాగునీరందిస్తాం. ముందస్తుగానే గొట్టా బ్యారేజీలో నీటి నిల్వలు ఉంచాం. శివారు ఆయకట్టుకూ తడులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం’..ఇలా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో ఎడమ ప్రధాన కాలువ పరిధిలో రైతులు వరి సాగుచేశారు. తీరా పంట పక్వానికి వచ్చే సమయంలో నీరు అందించలేక అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులు వ్యవప్రయాసలతో సాగుచేసిన వరి పనలను పశుగ్రాసానికి వినియోగిస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని లబోదిబోమంటున్నారు. ఖరీఫ్‌ నష్టాలను రబీలో అధిగమిస్తామనుకుంటే పరిస్థితి తారుమారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి, సంతబొమ్మాళి, నందిగాం మండలాల్లో వేలాది ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. రబీకి వంశధార ఎడమ కాలువ ద్వారా నీరందిస్తామన్న అధికారుల హామీతో రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు తెప్పించుకొని వేశారు. ప్రారంభంలో నీరు పుష్కలంగా అందడంతో రైతులు ఎరువులు, ఇతర రసాయనాల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేశారు. సరిగ్గా పైరు పక్వానికి వస్తున్న దశలో నీటి తడులు అవసరం. కానీ కాలువలు చూస్తే పూర్తిగా ఎండిపోయాయి. చుక్క నీరు విదల్చని దుస్థితి. అధికారులను అడుగుతుంటే గొట్టా బ్యారేజీ వద్ద నీటి లభ్యత లేదని చెబుతున్నారు. దీంతో రైతులకు ఏంచేయాలో పాలుపోలేదు. చెరువులు, కాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఇంజన్లతో తోడించి పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు. చి‘వరి’ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో రైతులు వరి పనలను కోసి పశుగ్రాసానికి వినియోగిస్తున్నారు. 


సమన్వయ లోపం..శాపం

 వంశఽధార, వ్యవసాయ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతో రైతులు నష్టపోయారు. రబీలో భాగంగా రైతులు సాగుచేస్తున్న విస్తీర్ణం, సాగునీటి అవసరాలపై ముందుగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనాకు రావాలి. అందుకు సంబంధించి నివేదిక రూపొందించాలి. గొట్టా బ్యారేజీలో నీటి లభ్యత, ఆయకట్టుకు నీరు సాధ్యాసాధ్యాలపై వంశధార అధికారులు ముందస్తుగా ప్రణాళికలు వేసుకోవాలి. వీటిపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు రబీలో భాగంగా వరి సాగుచేశారు. కానీ నీటిని అందించడంలో మాత్రం అధికారులు చేతులెత్తేశారు. టెక్కలి మండలం నర్సింగపల్లి, గూడెం, శాసనం, రావివలస, తలగాం, తేలినీలాపురం, సీతాపురం, తిర్లంగి, నందిగాం మండలంలోని జల్లపల్లి, వేణుగోపాలపురం, నందిగాం, దేవళభద్ర, మెండ్రాయివలస తదితర పంచాయతీల్లో వరి పంట పూర్తిగా ఎండిపోయింది. పొలాల వద్దకు వెళ్తున్న రైతులు పెట్టుబడులు తలచుకొని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయమై వ్యవసాయ శాఖ ఏడీ బీవీ తిరుమలరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. అంచనాకు మించి రబీ సీజన్‌లో రైతులు వరి విత్తనాలు వేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.




Updated Date - 2021-04-07T05:38:12+05:30 IST