చెరువులకు జలకళ
ABN , First Publish Date - 2021-07-26T04:55:33+05:30 IST
ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు ఆత్మకూరు ప్రాంతంలో చెరువులన్ని జలకళతో కళకళలాడుతున్నాయి.
ఆత్మకూరు,
జూలై 25: ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు ఆత్మకూరు ప్రాంతంలో
చెరువులన్ని జలకళతో కళకళలాడుతున్నాయి. జూలైలో 216.4మిమీల వర్ష్షపాతం
నమోదైంది. ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువుతో పాటు అమలాపురంలోని
ఆసువాగు చెరువు, ఇందిరేశ్వరంలోని మాచవీరప్ప, పద్మరాజు చెరువులు,
కురుకుందలోని మాచవీరప్ప చెరువు, కొట్టాలచెరువులోని కొత్తసోముల చెరువు,
వడ్లరామాపురంలోని పెద్దచిన్నమల్లమ్మ చెరువు, బైర్లూటిలోని గోసాయికట్ట
చెరువుల్లో నీటినిల్వలు చేరుకున్నాయి. అదేవిధంగా కృష్ణాపురం, నల్లకాల్వ,
కరివేన చెరువుల్లో కూడా కొంతమేర నీటినిల్వలు చేరుకున్నాయి. అల్పపీడన
వర్షాలతో కొట్టాలచెరువు సమీపంలో మునిమడుగుల వాగుపై నిర్మించిన వరదరాజ
స్వామి ప్రాజెక్ట్లో నీటిమట్టం పెరిగింది. దీంతో ఆయా చెరువుల ఆయకట్టు కింద
వరిపంటను సాగుచేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం వరి
నారుమళ్లను సైతం తయారు చేసుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన
మొక్కజొన్న, పత్తి, కంది, విత్తన పద్దతిలో సాగుచేసిన వరి, తదితర పంటలు
ఆశాజనకంగానే ఉన్నాయి.
మిడుతూరు: మండలంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొర్లి చెరువుల్లో జలకళ సంతరించుకుని కళకళలాడుతున్నాయి. మండలంలో మద్ది గుడ్డం చెరువు, నారపల్లి చెరువులకు ఉదృతంగా నీరు రావడంతో చెరువుల కింద సాగు చేస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.