హైదరాబాద్లో నడుచుకుంటూ వెళ్లినా ప్రాణాలు పోతున్నాయ్..!
ABN , First Publish Date - 2020-08-07T14:19:17+05:30 IST
రోడ్డు ప్రమాద మృతుల్లో అత్యధికం పాదచారులే..!
రోడ్డు ప్రమాద మృతుల్లో అత్యధికం పాదచారులే..!
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా పాదచారులే మృత్యువాత పడుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో ద్విచక్రవాహనదారులు ఉన్నారు. గత మూడేళ్లలో జరిగిన ప్రమాదాలతో పోలిస్తే ఏటా ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది పాదచారులేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సుమారు 40 శాతం మంది పాదచారులు మరణిస్తుండగా ఆ తర్వాతి స్థానంలో ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. యేటా సుమారు 25 నుంచి 30 శాతం మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని ఓ అధికారి వివరించారు.
జూన్ 30 వరకు...
2018లో 150 మంది ప్రమాదాల్లో మరణించగా వారిలో 63 మంది పాదచారులున్నారు. (42శాతం)
2019లో 137 మంది మరణించగా వారిలో 53 మంది పాదచారులున్నారు. (39 శాతం)
2020లో 106 మంది మరణించగా వారిలో 33 మంది పాదచారులున్నారు. (31 శాతం)
కొన్నేళ్లుగా ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ప్రమాద కేంద్రాలు, బ్లాక్స్పాట్లను గుర్తించి అక్కడ నిరంతర చర్యలు తీసుకోవడంతో మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోందని అధికారులు వివరిస్తున్నారు.
గణాంకాలు
2018లో ఆగస్టు 3 వరకు రోడ్డు ప్రమాదాల్లో 203 మంది మృతి చెందగా... 1633 మంది గాయాల పాలయ్యారు.
2019లో ఇదే సమయానికి 186 మంది మృతి చెందగా 1761 మందికి గాయాలయ్యాయి.
2020లో 125 మంది మృతి చెందారు. 1044 మంది గాయాల పాలయ్యారు.
మృతి చెందిన వారిలో సుమారు 40 శాతం పాదచారులే.
రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారిలో పాదచారుల మరణాలకు సంబంధించిన అర్ధ వార్షిక డేటా (జూన్ 30, 2020)ను పోలీసులు వివరించారు.