ఉపాధి కోల్పోయిన కార్మికులకు వేతనాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-04-17T05:10:32+05:30 IST
టెక్స్టైల్ పార్కులో పరిశ్రమలు బంద్ చేయడంతో ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ ఆ కాలానికి వేతనాలు చెల్లించాలని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి టెక్స్టైల్ పార్కులో పనిచేస్తున్న పవర్లూం, అనుబంధ రంగాల కార్మికుల నిరసనకు జిల్లా అధ్యక్షుడు కోడం రమణతో కలిసి హాజరయ్యారు.
తంగళ్లపల్లి, ఏప్రిల్ 16: టెక్స్టైల్ పార్కులో పరిశ్రమలు బంద్ చేయడంతో ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ ఆ కాలానికి వేతనాలు చెల్లించాలని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి టెక్స్టైల్ పార్కులో పనిచేస్తున్న పవర్లూం, అనుబంధ రంగాల కార్మికుల నిరసనకు జిల్లా అధ్యక్షుడు కోడం రమణతో కలిసి హాజరయ్యారు. అనంతరం బతుకమ్మ చీరెలకు సంబంధించిన కూలి పెంచాలని టెక్స్టైల్ ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యజమానులు పలు కారణాలతో తరుచూ పరిశ్రమలు బంద్ చేస్తున్నారని, సుమారు వెయ్యి మందికిపైగా కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. నెలసరి జీతానికి పనిచేసే కార్మికుల వేతనాల్లో సైతం కోతలు విధిస్తున్నారని, టెక్స్టైల్ పార్కులో కార్మిక చట్టాలు అమలు కావడంలేదని ఆరోపించారు. పరిశ్రమలు బంద్ చేసి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని, యజమానులు కార్మికులను బ్లాక్మేయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల మధ్య చిచ్చు పెట్టి సమ్మెలను విచ్ఛిన్నం చేస్తున్నారని పద్ధతి మార్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టెక్స్టైల్ పార్కు పవర్లూం, వార్పిన్, వైపని, డ్రాపిన్, జాఫర్, హెల్పర్లు, మాస్టర్లు, హమాలీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.