మహా ’వ్యూహమా?

ABN , First Publish Date - 2020-10-02T09:47:14+05:30 IST

ఎంతో ప్రతిష్ఠ కలిగిన ‘మాన్సాస్‌’లో ఏంజరుగుతోంది? అక్కడి పెద్దల నిర్ణయాలు ఎటువైపు నడిపిస్తున్నాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మహా ’వ్యూహమా?

 ఎం.ఆర్‌.కళాశాల ప్రైవేటీకరణ యోచనపై గరంగరం 

చైర్‌పర్సన్‌ నిర్ణయాలపై విస్మయం


(విజయనగరం-ఆంధ్రజ్యోతి):

ఎంతో ప్రతిష్ఠ కలిగిన ‘మాన్సాస్‌’లో ఏంజరుగుతోంది? అక్కడి పెద్దల నిర్ణయాలు ఎటువైపు నడిపిస్తున్నాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అక్కడ అనేక పరిణామాలు వేగంగా... రహస్యంగా సాగిపోతున్నాయన్న ఆరోపణలున్నాయి. ట్రస్టులో ఏ నిర్ణయం తీసుకున్నా ఏవో ముందుస్తు వ్యూహాల్లో భాగమనే భయాందోళన సిబ్బందిలో స్పష్టంగా కన్పిస్తోంది. తాజాగా మహరాజా కళాశాల ప్రైవేటీకరణపై మాన్సాస్‌ చైర్‌పర్సన్‌ సంచయిత తీసుకున్న నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. మహరాజా కళాశాలను ఎయిడెడ్‌ నుంచి అన్‌ఎయిడెడ్‌ కళాశాలగా మార్పు చేయాలన్నది తాజా ప్రతిపాదన.


ఈ కళాశాల పూసపాటి వంశ రాజులతో పాటు జిల్లా చరిత్రతో ముడిపడి ఉంది. ఇక్కడ చదువుకుని ఎంతోమంది ఉన్నత విద్యావంతులయ్యారు. దేశ విదేశాల్లో ఎన్నో సంస్థల్లో కీలక బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం కళాశాలలో 50 మంది వరకు బోధనా సిబ్బంది పనిచేస్తున్నారు. తాజా పరిణామాలపై వీరంతా టెన్షన్‌ పడుతున్నారు. వీరిలో అభద్రతా భావం గూడు కట్టుకుంది. ప్రభుత్వ పరంగా, మాన్సాస్‌ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎం చేయదలిచారు? వంటి అంశా లు కనీసం తమ దృష్టికి రావటం లేదని మీడియా ముందు సంబంధిత అధ్యాపక సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.


ఎయిడెడ్‌ కళాశాల నుంచి ప్రైవేట్‌ పరం చేయకుండా తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కొనసాగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉండగా మాన్సాస్‌ పూర్వ చైర్మన్‌, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్‌ పరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంతో మంది ప్రముఖులను అందించిన కళాశాల అని.. సంఘ సంస్కర్తలను, విద్యా వేత్తలను అందించిన చరిత్ర ఉందని గుర్తు చేవారు. ఈ కళాశాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా... సంబంధిత ఉద్యోగులతో చర్చించి ముందుకు వెళ్లాలన్నారు. కళాశాలను ప్రైవేట్‌ పరం చేసే ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-10-02T09:47:14+05:30 IST