ఆలమూరు మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి మృతి
ABN , First Publish Date - 2021-12-29T06:59:21+05:30 IST
మండపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంకా వీర వెంకట సత్యనారాయణ చౌదరి (వీవీఎస్ఎస్ చౌదరి)(83) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందూతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.
మండపేటలో విషాదఛాయలు
మండపేట, డిసెంబరు 28: మండపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంకా వీర వెంకట సత్యనారాయణ చౌదరి (వీవీఎస్ఎస్ చౌదరి)(83) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందూతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆలమూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున 1994-1999 మధ్య రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఆలమూరు నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారు. 2009లో పీఆర్పీ తరపున మండపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన వైసీపీకి మద్దతు తెలిపారు. 2015లో మళ్లీ టీడీపీలో చేరారు. 2019నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య ఉన్నారు. పారిశ్రామికవేత్తగా, రైతుగా, ధర్మదాతగా ఆయన ఇక్కడ ప్రజలకు సుపరిచితులు. చౌదరి మరణ వార్త విన్న వెంటనే మండపేట పట్టణంలో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మండపేటకు తీసుకువస్తున్నారు. రెడ్డివారివీధిలో ఉన్న చౌదరి ఇంటివద్ద సందర్శకులకోసం బుధవారం ఉదయం 8 గంటల వరకు మృతదేహాన్ని ఉంచుతామని బంధువులు తెలిపారు. చౌదరి పార్దివదేహానికి ఏడిద సంఘమేశ్వరాలయం వద్ద ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
చౌదరి మృతికి పలువురు సంతాపం
ఆలమూరు మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి మృతి టీడీపీకి తీరనిలోటని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, టీడీపీ కాకినాడ పార్టమెంటరీ పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్కుమార్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వి.సాయికుమార్బాబు, మండపేట మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, విజయనగరం ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ, ఆలమూరు మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జునచౌదరి, వైసీపీ నేత వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ, మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కామన ప్రభాకరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు, మండపేట మండల టీడీపీ అధ్యక్షుడు యరగతపు బాబ్జి, మాజీ ఎంపీపీలు గోసాల సుజాత, పితాని వెంకటేశ్వరరావు, అడబాల బాబ్జి, పలువురు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.