పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-10-31T04:09:29+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నవంబరు నుంచి రెండో విడత విజృంభణ ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
తాజాగా 152 మందికి వైరస్
చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి
విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నవంబరు నుంచి రెండో విడత విజృంభణ ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. శుక్రవారం జిల్లాలో 152 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 56,212 చేరింది. వీరిలో 53,650 మంది వైరస్ నుంచి కోలుకోగా, 2,086 మంది వైద్య సేవలు పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం ఇద్దరు మృతిచెందడంతో కొవిడ్ మరణాలు 476 చేరాయి. రావికమతం మండలానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు, గాజువాకకు చెందిన మహిళ కొవిడ్తో చనిపోయారు.
మన్యంలో 10 కేసులు
పాడేరు: ఏజెన్సీలో శుక్రవారం 10 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఏడీఎంహెచ్వో డాక్టర్ కె.లీలాప్రసాద్ తెలిపారు. జీకేవీధి మండలంలో 4, కొయ్యూరులో 4, పాడేరులో ఒకటి, అనంతగిరిలో ఒకటి చొప్పున కొవిడ్ కేసులు నమోదయ్యాయన్నారు.
కశింకోటలో 3...: స్థానిక పీహెచ్సీ పరిధిలో శుక్రవారం మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారి బి.రాజశేఖర్ చెప్పారు. కశింకోటలో వృద్ధుడు, యువకుడు, పిసినికాడలో మహిళ కరోనా బారినపడ్డారని తెలిపారు.