కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే: కేజ్రీవాల్
ABN , First Publish Date - 2022-02-03T22:16:55+05:30 IST
గోవా ప్రజలకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఆప్కు ఓటేయడం, రెండు బీజేపీకి ఓటేయడం. అవినీతిలేని పాలన, నిజాయితీగల ప్రభుత్వం కావాలనుకుంటే ఆప్కు ఓటేయండి. ఇక రెండో అవకాశం బీజేపీ. బీజేపీకి రెండు రకాలుగా ఓటేయొచ్చు..
పనాజీ: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని, కాంగ్రెస్ నేతలను గెలిపించిన అనంతరమే వారు భారతీయ జనతా పార్టీలో చేరిపోతారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గురువారం గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పనాజీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీని రాష్ట్రం నుంచి తరిమేయాలంటే ఆప్కు ఓటేయాలని గోవా ఓటర్లకు పిలుపునిచ్చారు.
‘‘గోవా ప్రజలకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఆప్కు ఓటేయడం, రెండు బీజేపీకి ఓటేయడం. అవినీతిలేని పాలన, నిజాయితీగల ప్రభుత్వం కావాలనుకుంటే ఆప్కు ఓటేయండి. ఇక రెండో అవకాశం బీజేపీ. బీజేపీకి రెండు రకాలుగా ఓటేయొచ్చు. నేరుగా, పరోక్షంగా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరోక్షంగా బీజేపీకి ఓటేసినట్టే. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు గెలిచిన అనంతరమే బీజేపీలో చేరతారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.
2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 17 గెలిచింది. అయితే కేవలం 13 స్థానాలు మాత్రమే గెలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. దీనికి కారణం ఎంజీబీ, జీఎఫ్పీ పార్టీల మద్దతు ఒక కారణం కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో పెద్ద చేరడం మరొక కారణం. ప్రస్తుతం గోవాలో కాంగ్రెస్కు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.