నేడే ఓట్ల లెక్కింపు
ABN , First Publish Date - 2021-05-02T08:11:51+05:30 IST
దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం చేపట్టనున్న లెక్కింపునకు అధికారులు కొవిడ్ నిబంధనలకు...
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్
- మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలకే ఓటర్లు
- మళ్లీ పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
- పశ్చిమబెంగాల్ తీర్పుపైనే అందరి దృష్టి
- తమిళనాడులో డీఎంకేకు అధికారం ఖాయం!
తిరువనంతపురం/చెన్నై, మే 1: దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం చేపట్టనున్న లెక్కింపునకు అధికారులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దేశ రాజకీయాల్లో తమకు ఎదురు లేదని చాటాలనుకుంటున్న బీజేపీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కంట్లో నలుసుగా మారడం, ఆమెను ఓడించేందుకు కాషాయ పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలూ చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ తిరిగి మమతకే అధికారం దక్కనున్నట్లు వెల్లడించినా.. బీజేపీ కూడా గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. మరో ప్రధాన రాష్ట్రం తమిళనాడు ఫలితం కూడా కీలకంగా మారింది. దక్షిణాదిన పెద్ద రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకేతో కలిసి బీజేపీ కూటమిగా బరిలోకి దిగగా, సర్వేలతోపాటు ఎగ్జిట్ పోల్స్ ప్రతిపక్ష డీఎంకే-కాంగ్రెస్ కూటమికి ఆధిక్యం కట్టబెట్టాయి. సినీనటుడు కమల్హాసన్ పార్టీ మక్కల్ నీదిమయ్యమ్ కూడా పలు పార్టీలతో కలిసి మరో కూటమిగా పోటీ చేసింది. దీంతో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరో దక్షిణాది రాష్ట్రం కేరళలో అధికారం మళ్లీ వామపక్ష కూటమిదేనని మొదటినుంచీ అంచనాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడించాయి. ఇక్కడ బీజేపీ ప్రభావం నామమాత్రమే కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ కూడా గెలుపుపై ధీమాగానే ఉంది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి సారథ్యంలోని ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రె్స-బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి. మరోవైపు ఇక్కడ కూడా కాంగ్రెస్, డీఎంకే జట్టుగా బరిలోకి దిగాయ. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం రంగస్వామి నేతృత్వంలోని కూటమికే అధికారం దక్కనుందని వెల్లడించాయి. కాగా, అసోంలోనూ మళ్లీ ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాలున్నాయి. కానీ, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు ఏవిధంగా ఉంటుందన్నది ఆదివారం తేలనుంది. ఉదయం 8గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల తరఫున ఏజెంట్లుగా ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్గా వచ్చిన రిపోర్టు సమర్పించిన వారినే అనుమతించనున్నారు.