ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు?
ABN , First Publish Date - 2021-01-24T16:10:22+05:30 IST
ప్రియురాలిని ప్రియుడు అంతం చేసిన ఘటన..
యండపల్లిలో ఉంటున్న వివాహితతో యువకుడు వివాహేతర సంబంధం
కోటవురట్ల్ల(విశాఖపట్నం): ప్రియురాలిని ప్రియుడు హత్య చేసిన ఘటన యండపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చేటుచేసుకుంది. ఇందుకు సంబంధించి నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కైలాసపట్నానికి చెందిన రమాదేవి (25)కు 2011లో తూ.గో. జిల్లా తునికి చెందిన పేరూరి దుర్గాప్రసాద్తో వివాహం అయ్యింది. అప్పటి నుంచి భార్యాభర్తలు యండపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి జోసఫ్కుమార్ (7), జెస్సీ ప్రియాంక (6) పిల్లలు ఉన్నారు. దుర్గాప్రసాద్ క్లీనర్ కాగా, రామాదేవి నర్సీపట్నంలోని ఓ హోటల్లో సర్వర్గా పనిచేసేది. యండపల్లి నుంచి రోజూ నర్సీపట్నం రాకపోకలు సాగించేది. ఈ క్రమంలో సుంకపూర్కు చెందిన యువకుడితో రమాదేవికి పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధం నడిచేదని, ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని చెప్పారు.
ఇటీవల భర్త సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చి, ఆ తరువాత విధులకు వెళ్లాడు. శుక్రవారం రాత్రి సుంకపూర్కు చెందిన యువకుడు రమాదేవి ఇంటికి వచ్చాడని, శనివారం వేకువ జామున రమాదేవిని కుమారుడు లేపగా అచేతనంగా పడి ఉండడంతో చుట్టుపక్కలవారు వచ్చి చూసి, మృతి చెందినట్టు గుర్తించారన్నారు. అయితే రమాదేవి మెడపై కమిలిన గాయం ఉందని, దీనిని బట్టి ప్రియుడే ఆమెను హత్య చేసినట్టు భావిస్తున్నామని సీఐ తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేష్కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.