లాజిస్టిక్స్ ఆదాయంలో విశాఖ రీజియన్ ముందంజ
ABN , First Publish Date - 2021-06-25T06:07:51+05:30 IST
కార్గో, పార్శిల్ రవాణాలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్ ముందు వరుసలో ఉందని ఆ శాఖ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు.
పీటీడీ కమిషనర్ ద్వారకా తిరుమలరావు
ద్వారకాబస్స్టేషన్, జూన్ 24 : కార్గో, పార్శిల్ రవాణాలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్ ముందు వరుసలో ఉందని ఆ శాఖ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. కొవిడ్ కష్టకాలంలో కూడా అధిక ఆదాయం సాధించిందన్నారు. అందుకు కారకులైన అధికారులను, సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ద్వారకా కాంప్లెక్స్, దాని ఆవరణలోని లాజిస్టిక్స్ విభాగం కార్యాలయాన్ని, వాల్తేరు డిపోను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వాల్తేరు డిపో గ్యారేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమర్షియల్ ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని సూచించారు. లాజిస్టిక్స్ సేవలను వినియోగదారులకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలన్నారు. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రయాణికులకు ఉత్తమ సేవలందించడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకోవచ్చునని, తద్వారా ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. పీటీడీ సిబ్బంది సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి, విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్, సీఎంఈఎం విజయరత్నం, విశాఖపట్నం రీజనల్ మేనేజర్ ఎంవై దానం, విశాఖ రీజియన్ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్లు బి.అప్పలనాయుడు (అర్బన్), సీహెచ్ అప్పలనారాయణ (జిల్లా), డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్లు కణితి వెంకటరావు( జిల్లా), సుధాబిందు (అర్బన్), వాల్తేరు డిపో మేనేజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాజిస్టిక్స్ విభాగంలో ఉత్తమ ఫలితాలు సాధించిన అధికారులు విజయనగరం జోన్ ఈడీ రవికుమార్, వైజాగ్ ఆర్ ఎం వై దానంతో పాటు మరో ఎనిమిది మంది సిబ్బందికి పీటీడీ కమిషనర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం వాల్తేరు డిపో గ్యారేజీ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంవీపీకాలనీలోని ఈడీ క్యాంప్ కార్యాలయంలో పీటీడీ విజయనగరం జోన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.