విరుల సాగు.. సిరుల దిగుబడి!
ABN , First Publish Date - 2022-05-24T04:52:33+05:30 IST
బంతి పూల సాగుతో సిరులు పండుతున్నా యంటున్నారు నియోజకవర్గంలోని రైతులు. పెట్టుబడి ఓ మోస్తరు ఎక్కువగానే ఉన్నా, చీడపీడలు అంతగా ఆశించకపోవడం, సాగు సమస్యలు తక్కువగా ఉండడంతోపాటు తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తుండడం రైతుకు లాభసాటిగా మారింది.
కిలో బంతి పూలు రూ. 50
ఎకరాకు రూ. 70 వేలు ఖర్చు
సాగుపై రైతుల మక్కువ
రైల్వేకోడూరు, మే 23: బంతి పూల సాగుతో సిరులు పండుతున్నా యంటున్నారు నియోజకవర్గంలోని రైతులు. పెట్టుబడి ఓ మోస్తరు ఎక్కువగానే ఉన్నా, చీడపీడలు అంతగా ఆశించకపోవడం, సాగు సమస్యలు తక్కువగా ఉండడంతోపాటు తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తుండడం రైతుకు లాభసాటిగా మారింది. దీనికితోడు బంతి పూలకు మార్కెట్ డిమాండ్ ఎక్కువగానే ఉండడం, ప్రతి రోజూ డబ్బు కళ్లజూసే అవకాశం ఉండడంతో అధిక శాతం రైతులు ఈ పంట సాగుపై మక్కువ చూపుతున్నారు.
ఈ పైరు సాగుకు అవసరమైన నారు ను మదనపల్లె ప్రాంతం నుంచి ఒక్కో మొక్కకు రూ.3.50 చెల్లించి కొనుగోలు చేస్తారు. ఈ లెక్కన ఒక ఎకరాలో బంతిపూల తోట సాగు చేయాలంటే నారుకే రూ.50 వేలదాకా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సాగు ఖర్చులు, ఎరువులు చీడపీడల యాజమాన్యం, కలుపుతీత కూలీలు తదితరాలకు చేసే ఖర్చు అదనం. నారు వేసినప్పటి నుంచి 50 రోజులకు పంట చేతికి వస్తుంది. ఇలా వచ్చిన పంటను రైల్వేకోడూరు, రాజంపేట, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాలతో పాటు తమిళనాడు తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.